Fastag: ఫాస్టాగ్ వార్షిక పాస్తో 10 రోజుల్లో 1.70 లక్షల వాహనాల ప్రయాణం
ABN , Publish Date - Aug 25 , 2025 | 04:18 AM
జాతీయ రహదారులపై ప్రయాణించే కార్లు, జీపులు, వ్యాన్లు తదితర వాణిజ్యేతర వాహనాల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఫాస్టాగ్ వార్షిక పాస్ వినియోగం రాష్ట్రంలో బాగానే ఉంటోంది.
రాష్ట్రంలోని 36 టోల్ ప్లాజాల పరిధిలో నమోదు
హైదరాబాద్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారులపై ప్రయాణించే కార్లు, జీపులు, వ్యాన్లు తదితర వాణిజ్యేతర వాహనాల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఫాస్టాగ్ వార్షిక పాస్ వినియోగం రాష్ట్రంలో బాగానే ఉంటోంది. ఈ నెల 15న ఈ వార్షిక పాస్ను అందుబాటులోకి తెచ్చినప్పటి నుంచి ఆదివారం వరకు (10 రోజుల్లో) 1.70 లక్షల వాహనాలు వార్షిక పాస్ను వినియోగించుకున్నాయి. రాష్ట్రంలోని 36 టోల్ ప్లాజాల గుండా ఈ పాసులతో వాహనాలు రాకపోకలు సాగించినట్టు సంబంధిత అధికారులు తెలిపారు.
ఈ పాస్ జాతీయ రహదారులు, ఎక్స్ప్రె్సవేలపైనే చెల్లుబాటు అవుతుంది. రాష్ట్రాల పరిధిలోని టోల్ ప్లాజాల్లో ఇది వర్తించదు. రాజ్మార్గ్ యాత్ర యాప్ లేదా ఎన్హెచ్ఏఐ వెబ్సైట్ ద్వారా ఈ పాస్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. రూ.3వేలతో ఈ పాస్ను కొనుగోలు చేసిన తర్వాతి నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత మళ్లీ రూ.3వేలతో యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది.