Share News

జోరుగా ధాన్యం కొనుగోళ్లు

ABN , Publish Date - May 09 , 2025 | 12:59 AM

జగిత్యాల, మే 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో వంద శాతం కొనుగోలు చేసిన ఐదు కేంద్రాలను అధికారులు మూసివేశారు. వచ్చే పక్షం రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేయడానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ప్రస్తుత సీజన్‌లో జిల్లాలో 4,90,217 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేయగా, వాతావరణ పరిస్థితులతో దిగుబడులు తగ్గడంతో ధాన్యం అంచనా మేరకు కేంద్రాలకు రాలేదు.

జోరుగా ధాన్యం కొనుగోళ్లు

-ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లో నగదు జమ

-ఇప్పటివరకు 1,76,500 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

-వంద శాతం సేకరణ పూర్తి చేసిన ఐదు కేంద్రాల మూత

-15 రోజుల్లో కొనుగోళ్ల పూర్తికి యత్నం

జగిత్యాల, మే 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో వంద శాతం కొనుగోలు చేసిన ఐదు కేంద్రాలను అధికారులు మూసివేశారు. వచ్చే పక్షం రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేయడానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ప్రస్తుత సీజన్‌లో జిల్లాలో 4,90,217 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేయగా, వాతావరణ పరిస్థితులతో దిగుబడులు తగ్గడంతో ధాన్యం అంచనా మేరకు కేంద్రాలకు రాలేదు. దీనికి తోడు పలువురు రైతులు ప్రైవేటు మార్కెట్‌లో ధాన్యం అమ్ముకున్నారు. ప్రస్తుతం 2024-25 యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు 1,76,500 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అధికారులు సేకరించారు.

ఫ2.97 లక్షల ఎకరాల్లో వరి సాగు

యాసంగి సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 2,97,365 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందులో దొడ్డు రకం ధాన్యం ఎక్కువగా ఉంది. అక్కడక్కడ సన్న రకం సాగు చేశారు. ఇందుకు గాను జిల్లాలో 4.90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్న తొలుత అంచనా వేశారు. ఈ మేరకు జిల్లా సహకార, మార్కెటింగ్‌, ఇందిరా క్రాంతిపథం, మెప్మా తదితర శాఖల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌ నుంచి కేంద్రాలను ప్రారంభించి కొనుగోలు జరుపుతున్నారు. దిగుబడులు తగ్గడం వల్ల కేవలం 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేంద్రాలకు రానున్నట్లు ప్రస్తుతం అంచనా వేస్తున్నారు.

ఫజిల్లాలో కొనుగోళ్లు ఇలా...

జిల్లా వ్యాప్తంగా 427 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్నారు. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 137 కేంద్రాలు, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 289 కేంద్రాలు, మెప్మా ఆధ్వర్యంలో ఒకటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 24,093 మంది రైతుల వద్ద నుంచి రూ.409.48 కోట్ల విలువ గల 1,76,500 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో రూ.347.85 కోట్ల విలువ గల 1,49,934 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ట్యాబ్‌ల్లో అప్‌లోడ్‌ చేశారు. రూ.281.14 కోట్ల విలువ గల 1,21,182 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని లారీల్లో లోడ్‌ చేసి మిల్లర్లకు పంపగా ట్రక్‌షీట్‌ జనరేట్‌ అయింది. ఇందుకు గాను 1,18,619 మెట్రిక్‌ టన్నులకు సంబంధించిన రూ.275.20 కోట్ల డబ్బులను 14,399 మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

పకడ్భందీగా ధాన్యం కొనుగోళ్లు

-బీఎస్‌ లత, అదనపు కలెక్టర్‌

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన జాగ్రత్తలను తీసుకుంటున్నాం. కొనుగోళ్లు వంద శాతం పూర్తి చేస్తాం. వచ్చే పక్షం రోజుల్లో పూర్తి స్థాయిలో కొనుగోళ్లు పూర్తి చేసే దిశగా పనిచేస్తున్నాం. సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేయడం, ట్యాబ్‌ ఎంట్రీ పూర్తి చేయడం, లారీల్లో లోడింగ్‌ చేయడం, మిల్లర్లకు రవాణా చేయడం, మిల్లుల్లో అన్‌లోడింగ్‌, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - May 09 , 2025 | 01:00 AM