కుటుంబాలకు ఇన్సూరెన్స్ రక్షణ : ఎస్పీ
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:03 PM
ఉద్యోగంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరమని, చిన్న వైద్యమైనా ఖర్చు ఎక్కువగా ఉంటుందని, అది కుటుంబాలకు అదనపు భారంగా మారుతోందని ఎస్పీ జానకి అన్నారు.
మహబూబ్నగర్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : ఉద్యోగంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరమని, చిన్న వైద్యమైనా ఖర్చు ఎక్కువగా ఉంటుందని, అది కుటుంబాలకు అదనపు భారంగా మారుతోందని ఎస్పీ జానకి అన్నారు. అందుకే అందరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, ఇన్సూరెన్స్ కుటుంబాలకు రక్షణ కవచంగా ఉంటుందన్నారు. హోంగార్డుల సంక్షేమంలో భాగంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఇన్సూరెన్స్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించగా, యాక్సిస్ బ్యాంక్ ఆధ్వర్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ సెక్యూరిటీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇటీవల జరిగిన కొన్ని అనుకోని మరణాలతో హోంగార్డు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అందుకే ప్రతీ ఒక్కరు ఇన్సూరెన్స్ చేసుకోవాలన్నారు. అకస్మాత్తుగా మరణం సంభవించినపుడు కుటుంబాలకు కనీస ఆర్థిక భరోసా అవసరమని అందుకు టర్మ్ ఇన్సూరెన్స్. లైఫ్ కవర్ ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాలన్నారు. యాక్సిస్ బ్యాంక్ అందిస్తున్న ప్రత్యేక ఇన్సూరెన్స్ ప్యాకేజీలు, తక్కువ ప్రీమియం గల కుటుంబ కవర్, క్యాష్లెస్ ట్రీట్మెంట్ లాంటి ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏఆర్ అదనపు ఎస్పీ సురేశ్కుమార్, ఆర్ఐలు నగేశ్, కృష్ణయ్య, యాక్సిస్ బ్యాంక్ సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.