Sunil Gavaskar: ఐపీఎల్ పునఃప్రారంభం.. పహల్గాం ఘటన నేపథ్యంలో బీసీసీఐకి గవాస్కర్ కీలక సూచన
ABN , Publish Date - May 15 , 2025 | 11:03 PM
పహల్గాం ఘటనలో అయిన వారిని కోల్పోయిన బాధితుల భావోద్వేగాలను గౌరవించేలా ఐపీఎల్లో డీజేలు, డ్యాన్సింగ్ గర్ల్స్ హంగామాను తొలగించాలని క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ విజ్ఞప్తి చేశారు.
పాక్తో ఉద్రిక్తతల సద్దుమణగడంతో ఐపీఎల్ మే 17 నుంచి పునఃప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ బీసీసీఐకి కీలక విజ్ఞప్తి చేశారు. పునఃప్రారంభ వేడుకను ఆర్భాటాలు లేకుండా వీలైనంత సాధారణ రీతిలో చేయాలని పిలుపునిచ్చారు. పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిలో ఎంతో మంది భారతీయులు దుఃఖంలో ఉన్నందున కేవలం క్రికెట్పైనే దృష్టి పెట్టాలని సూచించారు.
పహల్గాం దాడి తరువాత భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు దారి తీసిన విషయం తెలిసిందే. యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ఐపీఎల్ను బీసీసీఐ వారం పాటు వాయిదా వేసింది. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సి ఉండగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గవాస్కర్ బీసీసీకి కీలక విజ్ఞప్తి చేశారు. భారీ మ్యూజిక్, చీర్ లీడర్ల వంటివేమీ లేకుండా ఐపీఎల్ నిర్వహించాలని సూచించారు. కుటుంబసభ్యులకు సంఘీభావం తెలిపేందుకు ఇదే సరైన విధానమని అభిప్రాయపడ్డారు
‘‘ప్రస్తుతం ఐపీఎల్లో కొన్ని మ్యాచులు మిగిలున్నాయి. ఇప్పటివరకూ సుమారు 60 గేమ్స్ ఆడాము. ఇంకా 15 - 16 గేమ్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. కాబట్టి, ఈ మ్యాచుల్లో డీజేల హోరు, మ్యూజిక్ ఉండొద్దని ఆశిస్తున్నాను. కేవలం ఆటను కొనసాగిస్తే చాలు. డ్యాన్సింగ్ గర్ల్స్ వంటివేవీ అవసరం లేదు. ఇలా అయితే.. బాధితుల భావోద్వేగాలను గౌరవించినట్టు అవుతుంది’’ అని మీడియాకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ అన్నారు. ఇక పీబీకేఎస్, డీసీ మధ్య జరగాల్సిన మ్యాచ్ మే 24న జరిపేందుకు బీసీసీఐ నిర్వహించినట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి:
పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్తో స్నేహంపై వివరణ ఇచ్చిన నీరజ్ చోప్రా
నీరజ్ ఇక లెఫ్టినెంట్ కల్నల్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి