Kabaddi: బతుకు ‘ఆట’లో ఓడి..
ABN , Publish Date - Aug 16 , 2025 | 04:46 AM
క్రీడలను కెరీర్గా ఎంచుకున్నాడు.. అందుకు తగ్గట్టే అందులో రాణించాడు.. కానీ, జీవితంలో మాత్రం ఓడి పోయాడు. ఆర్థికంగా ఇబ్బందులు తాళలేక రైలుకింద పడి తనువు చాలించిన ఓ కబడ్డీ క్రీడాకారుడి విషాదాంతమిది.
ఆర్థిక ఇబ్బందులతో అప్పులపాలు
రైలుకింద పడి దుర్మరణం
కబడ్డీ క్రీడాకారుడి విషాదాంతం
తిప్పర్తి/శాలిగౌరారం (ఆంధ్రజ్యోతి): క్రీడలను కెరీర్గా ఎంచుకున్నాడు.. అందుకు తగ్గట్టే అందులో రాణించాడు.. కానీ, జీవితంలో మాత్రం ఓడి పోయాడు. ఆర్థికంగా ఇబ్బందులు తాళలేక రైలుకింద పడి తనువు చాలించిన ఓ కబడ్డీ క్రీడాకారుడి విషాదాంతమిది. నల్లగొండ జిల్లా శాలి గౌరారం మండల కేంద్రానికి చెందిన బండారు మహేష్ (37) జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో ఎన్నో పతకాలు సాధించాడు. అయితే, కెరీర్కు వీడ్కోలు పలికాక ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న మహేష్ ఆర్థికంగా ఇబ్బందుల కారణంగా అప్పులు చేశాడు.
అయితే, గురువారం సాయంత్రం తన ద్విచక్రవాహనంపై మిర్యాలగూడకు వెళ్లే క్రమంలో తిప్పర్తి చేరుకున్న మహేష్.. తాను రైలు కింద పడి చనిపోతున్నానని భార్య స్వప్నకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. తిప్పర్తి సమీపంలోని కన్నెకల్ రైల్వే అండర్ ప్రాసెస్ వద్ద మహేష్ విగతజీవిగా ఉండడాన్ని గుర్తించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.