Share News

India Versus Bangladesh: కొడితే..ఫైనల్‌కే

ABN , Publish Date - Sep 24 , 2025 | 06:06 AM

ఆసియాక్‌పలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా ఇక ఫైనల్‌పై దృష్టి సారించింది. సూపర్‌-4లో భాగంగా బుధవారం తమ రెండో మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది.

India Versus Bangladesh: కొడితే..ఫైనల్‌కే

  • నేడు బంగ్లాతో భారత్‌ మ్యాచ్‌

  • రాత్రి 8 గం. నుంచి సోనీ నెట్‌వర్క్‌లో

దుబాయ్‌: ఆసియాక్‌పలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా ఇక ఫైనల్‌పై దృష్టి సారించింది. సూపర్‌-4లో భాగంగా బుధవారం తమ రెండో మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది. తొలి మ్యాచ్‌లో పాక్‌ను చిత్తు చేసిన సూర్య కుమార్‌ సేన ఈ పోరులో గెలిస్తే ఫైనల్లో చోటు ఖాయమే. అటు బంగ్లా కూడా శ్రీలంకపై విజయంతో ఆత్మవిశ్వాసంతోనే ఉంది. కానీ గణాంకాలను పరిశీలిస్తే టీమిండియాకు ఇది కూడా ఏకపక్ష మ్యాచ్‌గానే పరిగణించవచ్చు. ఎందుకంటే బంగ్లాతో ఆడిన 17 టీ20ల్లో కేవలం ఒక్కసారి మాత్రమే ఓడింది. అయితే 2015 వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్‌ వివాదాస్పద నాటౌట్‌ తర్వాత ఇరు జట్ల మధ్య అంతగా సత్సంబంధాలు లేవు. భారత్‌తో ఆడినప్పుడు పాక్‌ మాదిరే బంగ్లా ఆటగాళ్లలోనూ కసి కనిపిస్తుంటుంది. అక్కడి అభిమానులు కూడా భారత జట్టును పోటాపోటీ ప్రత్యర్థిగా భావిస్తుంటారు. దీనికి తోడు మాజీ ప్రధాని హసీనాకు ఆశ్రయం ఇవ్వడంతో దౌత్యపరంగానూ రెండు దేశాల మధ్య ఇబ్బందులున్నాయి. అందుకే ఆగస్టులో బంగ్లాతో జరగాల్సిన వన్డే సిరీస్‌ను కూడా బీసీసీఐ వాయిదా వేసుకుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య పోరు కూడా ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. అయితే ఏ విభాగంలో చూసినా ప్రత్యర్థికన్నా భారత జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్లు అభిషేక్‌, గిల్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో బౌలర్లకు చెమటలు పట్టిస్తున్నారు. కెప్టెన్‌ సూర్య క్రీజులో నిలదొక్కుకుంటే భారీ స్కోరు ఖాయమే. అటు శాంసన్‌, హార్దిక్‌, దూబే స్థాయికి తగ్గట్టు ఆడాల్సి ఉంది. అలాగే తిలక్‌.. స్పిన్‌ను ఎదుర్కోవడంలో కాస్త ఇబ్బందిపడుతున్నాడు. ఈ ఏడాది స్పిన్నర్ల ద్వారా ఎదుర్కొన్న 80 బంతుల్లో అతడు 92 పరుగులు మాత్రమే సాధించాడు. బౌలింగ్‌లో బుమ్రా బంతుల్లో పదును తగ్గడం ఆందోళనకరమే అయినా దూబే, హార్దిక్‌ అండగా ఉంటున్నారు. స్పిన్‌లో కుల్దీప్‌, వరుణ్‌, అక్షర్‌ మరోసారి కీలకం కానున్నారు.


లిట్టన్‌, హ్రిదయ్‌పై ఆశలు

గత రికార్డులు ఎలా ఉన్నా భారత్‌ను ఓడించగల సత్తా తమ జట్టుకు ఉందని బంగ్లాదేశ్‌ కోచ్‌ సిమన్స్‌ అంటున్నాడు. అయితే ఈ జట్టు ఎక్కువగా కెప్టెన్‌ లిట్టన్‌ దాస్‌, తౌఫీద్‌ హ్రిదయ్‌ల బ్యాటింగ్‌పై ఆధారపడి ఉంది. ఒకవేళ భారత్‌ ముందుగా బ్యాటింగ్‌కు దిగితే మధ్య ఓవర్లలో స్పిన్నర్లు రిషాద్‌ హుస్సేన్‌, మెహదీ హసన్‌లతో పాటు డెత్‌ ఓవర్లలో పేసర్‌ ముస్తాఫిజుర్‌ ద్వారా కట్టడి చేయాలనుకుంటోంది. బంగ్లా 150-160 పరుగులను సులువుగానే ఛేదించగలుగుతోంది.

Untitled-2 copy.jpg

తుది జట్లు (అంచనా)

భారత్‌: అభిషేక్‌, శుభ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), సంజూ శాంసన్‌, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే, హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా.

బంగ్లాదేశ్‌: సైఫ్‌ హసన్‌, తన్‌జీద్‌ హసన్‌, లిట్టన్‌ దాస్‌ (కెప్టెన్‌), తౌహీద్‌ హ్రిదయ్‌, షమీమ్‌, జకెర్‌ అలీ, మెహదీ హసన్‌, నసూమ్‌ అహ్మద్‌, టస్కిన్‌ అహ్మద్‌, తన్‌జీమ్‌ హసన్‌, ముస్తాఫిజుర్‌.

Updated Date - Sep 24 , 2025 | 06:16 AM