Sydney: సిడ్నీలో వైభవంగా అష్టావధాన కార్యక్రమం
ABN , Publish Date - Aug 26 , 2025 | 10:56 AM
సిడ్నీ నగరంలో తెలుగు సంస్థల ఆధ్వర్యంలో అష్టావధాన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిల్ పురపాలకమండలి సభ్యులు సంధ్యారెడ్డి.. అవధాని తటవర్తి కళ్యాణ చక్రవర్తిని, సంచాలకులను, నిర్వాహక సంస్థలను అభినందించారు.
ఇంటర్నెట్ డెస్క్: సిడ్నీ (ఆస్ట్రేలియా) నగరంలో ఆగస్టు 23న (శనివారం) జనరంజని రేడియో సంస్థ, శ్రీ వేదగాయత్రి పరిషత్, సంగీత భారతీ న్యూజిలాండ్ తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో తెలుగులో అష్టావధాన కార్యక్రమం జరిగింది. మెల్బోర్న్ నగరవాసులు, తటవర్తి గురుకులం సంస్థాపకులు, అవధాన శారదామూర్తి తటవర్తి కళ్యాణ చక్రవర్తి నిర్వహించిన ఈ అవధాన కార్యక్రమానికి సాహిత్యరత్న తూములూరి సుబ్రహ్మణ్య శాస్త్రి సంచాలకులుగా వ్యవహరించారు.
సమస్య, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, ఆశువు, కృతిపద్యం, చిత్రానికి పద్యం, అప్రస్తుత ప్రసంగం అనే అంశాలతో 3 గంటలకు పైగా ఉత్కంఠతో సాగిన ఈ అష్టావధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం నాలుగు ఆవృత్తులతో (రౌండ్స్), 20 మంది పృచ్ఛకులతో, ఉన్నత సాహిత్య ప్రమాణాలతో కొనసాగింది. తెలుగుభాషను, సాహిత్యాభిమానాన్ని పెంచడానికి ఇటువంటి కార్యక్రమాలను తరచూ నిర్వహించాలని పలువురు ప్రేక్షకులు సూచించారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిల్ పురపాలకమండలి సభ్యులు సంధ్యారెడ్డి అవధాని తటవర్తి కళ్యాణ చక్రవర్తిని, సంచాలకులను, నిర్వాహక సంస్థలను అభినందిస్తూ, తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలకు తగిన ప్రోత్సాహాన్ని కల్పించగలమని తెలిపారు.
తదుపరి 11 వత్సరాల చిరంజీవి కృష్ణ సుహాస్ తటవర్తి అనర్గళంగా చెప్పిన గజేంద్రమోక్షం కథ సభా సదుల మనసులను రంజింప చేసింది.
ఆగస్టు 30 తేదీన మెల్బోర్న్ నగరంలో కూడా కళ్యాణ చక్రవర్తి ఆధ్వర్యంలో మరొక అష్టావధాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జనరంజని కల్చరల్ కోఆర్డినేటర్ స్వర్ణలత సీతంరాజు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
న్యూయార్క్ రోడ్డు ప్రమాదం.. మృతుల్లో భారతీయుడు ఉన్నట్టు పోలీసుల వెల్లడి
ఓపీటీని ట్రంప్ టార్గెట్ చేయనున్నారా.. విదేశీ విద్యార్థులకు చుక్కలే..