Indian student shot dead: కెనడాలో భారతీయ స్టూడెంట్ తూటాకు బలి.. నిందితుడిపై మర్డర్ కేసు నమోదు
ABN , Publish Date - Aug 08 , 2025 | 08:09 AM
కెనడాలో పొరపాటున తూటా తగిలి భారతీయ విద్యార్థిని కన్నుమూసిన కేసులో ఓ నిందితుడిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మిగిలిన నిందితులను కూడా గుర్తించి అదుపులోకి తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: కెనడాలో పొరపాటున తూటా తగలడంతో మరణించిన భారతీయ విద్యార్థిని కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న జెర్డెయిన్ ఫాస్టర్పై (32) హామిల్టన్ పోలీసులు ఫస్ట్ డిగ్రీ హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. అతడిపై హత్యాయత్నం అభియోగాన్నీ మోపారు. జెర్డెయిన్ను పోలీసులు మంగళవారం ఓంటారియోలోని నయాగారా ఫాల్స్ వద్ద అరెస్టు చేశారు.
ఏప్రిల్ 17న నాలుగు రోడ్ల కూడలి వద్ద నిలబడ్డ హర్సిమ్రట్ రన్ధావాకు పొరపాటున బుల్లెట్ తగలడంతో కన్నుమూశారు. ఆమె మోహాక్ కాలేజీలో ఫిజియోథెరపీ రెండో సంవత్సరం చదువుతున్నారు.
ఘటన జరిగిన రోజున బాధితురాలు బస్సు దిగాక నాలుగు రోడ్ల కూడలి వద్ద రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండగా జెర్డెయిన్ తూటా పొరపాటున తగిలి కన్నుమూశారు. కూడలి వద్దకు కార్లలో వచ్చిన కొందరు పరస్పరం కాల్పులు జరుపుకున్న సమయంలో ఈ దారుణం జరిగింది. ఈ సందర్భంగా హర్సిమ్రట్ వైపు దూసుకొచ్చిన తూటా ఆమెను బలితీసుకుంది. జిమ్ నుంచి తన ఇంటికి వెళుతున్న సమయంలో హర్సిమ్రట్ను మృత్యువు కబళించింది.
ఈ దారుణంపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించి నిందితులందరినీ గుర్తించి అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కేసులో నిందితుడు హామిల్టన్తోపాటు హాల్టన్, నయగారా ప్రాంతాల్లో అద్దె ఇళ్లల్లో ఉండేవాడని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పీ-4 పథకానికి ప్రవాసీయులు ముందుకు రావాలి: చంద్రబాబు
శాన్ జోస్లో ఐసీఏసీ ప్రారంభం...ఇంటి వద్దకే కాన్సులేట్ సేవలు!