TKS: బహ్రెయిన్లో తెలుగు కళా సమితి నాయకులకు ప్రభుత్వ సత్కారం
ABN , Publish Date - Dec 09 , 2025 | 07:14 PM
తెలుగు కళా సమితి (టి.కె.యస్) సేవలను ప్రశంసిస్తూ బహ్రెయిన్ ప్రభుత్వం సంస్థ ప్రతినిధులను సగౌరవంగా సత్కరించింది. తమ సేవలకు గుర్తింపుగా వారు జ్ఞాపికలను అందుకున్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: బహ్రెయిన్లోని ప్రవాసాంధ్ర సంఘం తెలుగు కళా సమితికి(టి.కె.యస్) అరుదైన గౌరవం దక్కింది. తెలుగు కళా సమితి సేవలను గుర్తించిన బహ్రెయిన్ ప్రభుత్వం టి.కె.యస్ ప్రతినిధులను సగౌరవంగా సత్కరించి అందలం ఎక్కించింది.
తెలుగు కళా సమితి అధ్యక్షులు జగదీశ్, మాజీ అధ్యక్షులు రఘునంద బాబు, సంక్షేమ విభాగం అధ్యక్షులు డి.వి.శివకుమార్లను బహ్రెయిన్ ప్రభుత్వం ఇటీవల సత్కరించింది. సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వాలంటీర్ల దినోత్సవం సందర్భంగా వీరిని బహ్రెయిన్ వాలంటీర్ల సంఘం చైర్మన్ అబ్దుల్ అజీజ్ రాషేద్ అల్ సనదీ, మంత్రిత్వ శాఖలోని సహాయక కార్యదర్శి, సీనియర్ అధికారి ఎనాస్ మొహమ్మద్ అల్ మజేద్ ఈ ముగ్గురి సేవలకు గుర్తింపుగా సత్కరిస్తూ జ్ఞాపికలను అందజేశారు.

బహ్రెయినీలు, అరబ్బులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో టి.కె.యస్ నాయకుల కుటుంబ సభ్యులు లక్ష్మి, పద్మ, ఆశలతో పాటు టి.కె.యస్ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రసాద్ కూడా పాల్గొన్నారు.
గల్ఫ్ దేశాలలో కొన్ని చోట్ల ఇటీవలి కాలంలో తెలుగు వారి సన్మానాలు అపహాస్యం పాలవుతూ సన్మానంలో ‘మానం’ తగ్గుతోందనే భావన బలపడుతున్న సందర్భంగా బహ్రెయినీ ప్రభుత్వం వీరిని సగౌరవంగా సత్కరించడం ముదావహమనే అభిప్రాయం వ్యక్తమైంది.
వివాదాలకు అతీతంగా ఒక వైపు సాంస్కృతిక కార్యక్రమాలు మరో వైపు సంక్షేమం, వినూత్న విజ్ఞాన కార్యక్రమాలను చేపడుతున్న తెలుగు కళా సమితి 35 సంవత్సరాల నుండి తెలుగు ప్రవాసీయులకు సేవలందిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తూ అన్ని వర్గాల మన్ననలను పొందుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి
ఖతర్లో ఏపీ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షికోత్సవ సభ
పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్.. అమెరికాలో లోకేశ్ విస్తృత పర్యటన