Soul: ఆ సౌందర్యమే శాశ్వతం
ABN , Publish Date - May 23 , 2025 | 04:33 AM
మోనాలిసా చిరునవ్వు లోని మాతృప్రేమ, ఆత్మ సౌందర్యానికి ప్రతీకగా నిలిచింది. బాహ్య అందాన్ని కాదని, సహజయోగ ద్వారా ఆత్మ సౌందర్యాన్ని వెలికితీయాలని ఈ సందేశం సూచిస్తుంది.
‘బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం మిన్న’ అనే మాట మనం తరచుగా వింటూ ఉంటాం. ఇంతకూ ‘ఆత్మ సౌందర్యం’ అంటే ఏమిటి? దాన్ని ఎలా పెంపొందించుకోవాలి?
ఇవి తెలుసుకోవలసిన ఆసక్తికరమైన విషయాలు.
చాలామంది దృష్టిలో... అందానికి అంటే సౌందర్యానికి ప్రతీక - మోనాలిసా. ఆ చిత్రాన్ని గీసిన కళాకారుడు లియోనార్డో డావిన్సీ. అతను ఫ్రాన్స్కు చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి. అతను సృజించిన చిత్రపటం మోనాలిసా నిజానికి ఒక బిడ్డను కోల్పోయిన తల్లిది. సంతాన వియోగంతో ఆమె చాలాకాలంగా బాధపడుతూ ఉంటుంది. ఒక రోజు... తన బిడ్డ పోలికలున్న మరొకరి బిడ్డను చూసినప్పుడు.. ఆమె ముఖంలో చిరునవ్వు ఉదయించింది. దాన్ని డావిన్సీ యథాతథంగా చిత్రించారు. ఆమె ముఖంలో విరిసిన చిరునవ్వు ఎన్ని తరాలు గడచినా... ఇప్పటికీ సౌందర్యానికి ప్రతీకగా నిలిచిపోయింది. ఆధునిక కాలంలో అందానికి ఉన్న నిర్వచనాల ప్రకారం మోనాలిసా పెద్ద అందగత్తె కాదు. కానీ ఆమె సౌందర్యానికి చిహ్నంగా ఆకర్షిస్తూనే ఉంది. ఆ చిత్రపటం నుంచి వచ్చే చైతన్య తరంగాలు మానవుల అంతరాత్మను స్పృశించడమే దీనికి కారణం. అది ఆత్మ సౌందర్యాన్ని ప్రతిబింబించే చిత్రపటం. ఎందుకంటే... ఒక మహిళ ముఖంలో మాతృప్రేమ ప్రతిఫలిస్తున్నప్పుడు... ఆమె అత్యంత సుందరంగా కనిపిస్తుంది.
మీ లోపలికి చూడండి...
మానవుల దృష్టిని అథోముఖంగా తీసుకువెళ్ళే భౌతికమైన శరీర ఆకర్షణ అంత ముఖ్యమైనది కాదు. మన శరీరంలోని ప్రతి భాగం నుంచి చైతన్య తరంగాలు ప్రవహించేలా మనం ఉండాలి. మనం దేనినైనా మనం తాకితే... దాని నుంచి చైతన్య తరంగాలు ప్రవహించడం ప్రారంభించాలి. అటువంటి సౌందర్యం... దైవికమైన సౌందర్యం. బాహ్య సౌందర్యం వెంట, కృత్రిమమైన ఆకర్షణల వెంట పరుగెత్తడం మంచిది కాదు. వేల సంవత్సరాల నుంచి వారసత్వంగా పొందిన సంస్కృతీ సంప్రదాయాలు మన భారతీయులకు ఉన్నాయి. వాటిని నిలబెట్టుకోవడానికి మనం ప్రయత్నించాలి. సంప్రదాయ కళలు, ఆభరణాలు, దుస్తులు... ఇవి వేల ఏళ్ళుగా వినియోగంలో ఉన్నాయి. వాటిని మనం ఉపయోగించుకోవాలి. కానీ పాశ్చాత్య దేశాల ప్రభావంతో మనం మన సంస్కృతిని మరిపోయాం. బయటి వాటిని అనుసరిస్తున్నాం. దీనివల్ల మనం మనలోని ‘ఆత్మ’గా పిలిచే అతి ముఖ్యమైన అంశం అజ్ఞానంతో కప్పడిపోతోంది. మన దేశంలో ఆత్మకు అలంకారంలాంటి విషయాలు వేలకొద్దీ ఉన్నాయి. అవి ఆత్మను అణచివేయవు. కానీ మన కళ్ళు బాహ్యమైన విషయాల మీద త్వరగా కేంద్రీకృతం అవుతాయి. మానవులమైన మన ధ్యాస ఎప్పుడూ బయటే ఉండడం దీనికి కారణం. అలాకాకుండా మన లోపలికి చూడడానికి ప్రయత్నించినప్పుడు... ఆ అంతర్ సౌందర్యాన్ని, దానిలోని ఆనందాన్ని గ్రహించగలుగుతాం.
ఆ మెరుపు మీలోనే ఉంది...
మరి ఆ ఆనందాన్ని వదిలేసి... మన ధ్యాస బయట ఎందుకు తిరుగుతోంది? ఎందుకంటే అంతర్ సౌందర్యాన్ని గ్రహించగలిగే స్థితిని మనం సాధించలేదు. అందుకే ఆత్మను పాడుచేసే వాటిని ఇష్టపడుతున్నాం. కానీ ఆ సంగతి తెలుసుకోవడం లేదు. సహజయోగ దీనికి మార్గం చూపుతుంది. సహజయోగ సాధన ద్వారా తమ లోపల ఉన్న కుండలినీ శక్తి జాగృతం చేసుకున్నవారు... భగవంతుని ఆశీస్సుల వల్ల ఆత్మ స్వరూపులుగా మారుతారు. అంటే పవిత్రత, మాతృప్రేమ, సంతృప్తి, సృజనాత్మకత, ధైర్యం, అందరితో కలసిపోయే స్వభావం, క్షమాగుణం లాంటి ఆత్మకు ఉండే శుభ లక్షణాలన్నిటినీ పొందుతారు. ఈ లక్షణాలతో జీవించడం వల్ల మనం ఆత్మ సౌందర్యాన్ని పొందగలం. కాబట్టి మీ లోపల ఉన్న ‘ఆత్మ’ అనే వజ్రాన్ని గుర్తించండి. దాని లక్షణాలను గ్రహించండి. మీరే ఆ వజ్రం అని తెలుసుకోండి. దాని మెరువు మీలోనే ఉంది. ఆత్మ సాక్షాత్కారం ద్వారా మీ ఆత్మ సౌందర్యం అనే ఆ మెరుపు ప్రజల్లో మీ పట్ల గౌరవాన్ని పెంచుతుంది. మీలో శాశ్వతంగా నిలిచేది అదే. కాబట్టి ఆత్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి. భౌతిక సౌందర్యం కోసం వెంపర్లాడి అనుకరణల జోలికి పోకుండా... మీలో ఉన్న ‘మిమ్మల్ని’ గుర్తించండి. అదే మీ శాశ్వతమైన విలువ. దాన్ని అభివృద్ధి చేసుకోండి.
మన కళ్ళు బాహ్యమైన విషయాల మీద త్వరగా కేంద్రీకృతం అవుతాయి. మానవులమైన మన ధ్యాస ఎప్పుడూ బయటే ఉండడం దీనికి కారణం. అలాకాకుండా మన లోపలికి చూడడానికి ప్రయత్నించినప్పుడు...
ఆ అంతర్ సౌందర్యాన్ని, దానిలోని ఆనందాన్ని గ్రహించగలుగుతాం.
డాక్టర్ పి. రాకేష్, 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,
సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ
ఈ వార్తలు కూడా చదవండి..
భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్
For National News And Telugu News