Share News

Chennai: ఎస్‌ఐని చంపేశాడు.. ఎన్‌కౌంటర్‌ అయ్యాడు

ABN , Publish Date - Aug 08 , 2025 | 06:33 AM

తిరుప్పూరు జిల్లా కుడిమంగళం స్పెషల్‌ సబ్‌ఇన్స్‌పెక్టర్‌ షణ్ముగవేల్‌ హత్యకేసు నిందితుడు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

Chennai: ఎస్‌ఐని చంపేశాడు.. ఎన్‌కౌంటర్‌ అయ్యాడు

  • హత్యకు ఉపయోగించిన వేట కొడవలి స్వాధీనానికి వెళ్లిన పోలీసులు

  • ఆ కొడవలితోనే పోలీసులపై మణికంఠన్‌ దాడి

  • గాయపడిన ఎస్‌ఐ శరవణకుమార్‌

  • ఆత్మరక్షణ కోసం సీఐ కాల్పులు.. మణికంఠన్‌ మృతి

చెన్నై, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): తిరుప్పూరు జిల్లా కుడిమంగళం స్పెషల్‌ సబ్‌ఇన్స్‌పెక్టర్‌ షణ్ముగవేల్‌ హత్యకేసు నిందితుడు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మంగళవారం అర్ధరాత్రి తాగిన మత్తులో కూలీలు మూర్తి(60), ఆయన కుమారులు తంగపాండి(25), మణికంఠన్‌(30) ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో మూర్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్సై షణ్ముగవేల్‌.. తన డ్రైవర్‌తో వెళ్లి ఘర్షణను అడ్డుకున్నారు. ఈ సమయంలో ముగ్గురూ కలిసి ఎస్సైపై దాడి చేసి చంపేశారు. ఈ ముగ్గురూ పోలీసులకు లొంగిపోయినట్లు తొలుత ప్రచారం జరిగింది. మణికంఠన్‌ను ఉడుమలైపేటలో అరెస్టు చేసినట్లు ప్రకటించిన పోలీసులు.. షణ్ముగవేల్‌పై దాడికి ఉపయోగించిన వేటకొడవలిని స్వాధీనం చేసుకునేందుకు గురువారం వేకువజామున అతడిని తీసుకెళ్లారు. చిక్కానత్తు ఉప్పువాగు ఒడ్డున వేటకొడవలిని స్వాధీనం చేసుకుంటుండగా.. మణికంఠన్‌ పోలీసులపై అదే ఆయుధంతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఎస్సై శరవణకుమార్‌ కుడిచేతికి గాయమైంది. ఆత్మరక్షణ కోసం మణికంఠన్‌పై సీఐ కాల్పులు జరపగా.. అతడు గాయపడ్డాడు. ఉడుమలపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మణికంఠన్‌ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఎస్సై శరవణకుమార్‌కు అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Updated Date - Aug 08 , 2025 | 06:45 AM