Accidental Death: టగ్బోట్ శుభ్రం చేస్తూ ఊపిరాడక ముగ్గురి మృతి
ABN , Publish Date - Sep 18 , 2025 | 04:11 AM
తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న వీవోసీ హార్బర్లో ఓ టగ్బోట్ శుభ్రం చేస్తూ ఊపిరాడక ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు...
చెన్నై, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న వీవోసీ హార్బర్లో ఓ టగ్బోట్ శుభ్రం చేస్తూ ఊపిరాడక ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు. ఈ ముగ్గురూ రాజ్స్థాన్కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీఓసీ హార్బర్ నుంచి ప్రతిరోజూ భారీగా వస్తువులు ఎగుమతి, దిగుమతి అవుతుంటాయి. ఈ నేపథ్యంలో బుధవారం హార్బర్లోని కార్గో టగ్ బోట్ అడుగున పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించేందుకు సందీప్ కుమార్ (22), జెనిక్సన్ థామస్ (35), హిరోన్ జార్జ్ (22) లోనికెళ్లారు. ఎంతసేపటికీ ఆ ముగ్గురూ బయటకు రాకపోవడంతో సహచర సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది లోనికెళ్లి చూడగా.. అప్పటికే వారు మృతి చెందినట్టు తేలింది.