Vijay Appeals to CM Stalin: కక్ష సాధించాలనుకుంటే.. నన్ను ఏమైనా చేయండి
ABN , Publish Date - Oct 01 , 2025 | 01:50 AM
తమిళనాడులోని కరూర్లో 41 మంది మృతి కారణమైన తొక్కిసలాట దుర్ఘటనపై తమిళగ వెట్రి కళగం టీవీకే అధినేత విజయ్ ఎట్టకేలకు స్పందించారు...
మా కార్యకర్తల జోలికి రావొద్దు
తమిళనాడు సీఎం స్టాలిన్కు టీవీకే అధినేత విజయ్ విజ్ఞప్తి
చెన్నై, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని కరూర్లో 41 మంది మృతి కారణమైన తొక్కిసలాట దుర్ఘటనపై ‘తమిళగ వెట్రి కళగం(టీవీకే)’ అధినేత విజయ్ ఎట్టకేలకు స్పందించారు. ఇలాంటి బాధాకరమైన స్థితిని తన జీవితంలో ఎన్నడూ చూసి ఎరుగనని, త్వరలోనే బాధితులను కలుసుకుంటానని చెప్పారు. కరూర్లో ఏం జరిగిందో ప్రజలు చూస్తూనే ఉన్నారని, త్వరలోనే అన్ని వాస్తవాలూ బయటకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కక్ష సాధించాలనుకుంటే తనను ఏమైనా చేయాలని, కానీ తన అనుచరులను మాత్రం వదిలేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్కు విజ్ఞప్తి చేశారు. తన రాజకీయ పయనం మరింత దృఢంగా, మరింత ధైర్యంగా కొనసాగుతుందని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం 4 నిమిషాల 45 సెకండ్ల నిడివి కలిగిన వీడియో సందేశాన్ని విజయ్ విడుదల చేశారు. ‘‘అందరికీ నమస్కారం. నా జీవితంలో ఇలాంటి బాధాకరమైన స్థితి ని చూసి ఎరుగను. హృదయమంతా ఒకటే బాధ. నామీద పెట్టుకున్న అభిమానానికి, ఆప్యాయతకు ప్రజలకు ధన్యవాదాలు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని మాకిచ్చిన స్థలంలోనే ప్రచారం చేశాం. ఈ విషయంలో మేమెలాంటి తప్పూ చేయలేదు. అయినా జరగకూడనిది జరిగిపోయింది’’ అని విజయ్ పేర్కొన్నారు. కాగా, తన అభిమాన నటుడిపై విమర్శలు రావడంతో తట్టుకోలేని టీవీకే నేత, విల్లుపురం జిల్లా వీరపట్టు గ్రామానికి చెందిన అయ్యప్పన్(50) సో మవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నారు.