Supreme Court: సర్ అధికారులకు బెదిరింపులా?
ABN , Publish Date - Dec 10 , 2025 | 02:59 AM
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2.0 (సర్) రూపకల్పనలో నిమగ్నమైన బూత్ స్థాయి....
ఈ ధోరణి తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది: సుప్రీం
న్యూఢిల్లీ, డిసెంబరు 9: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2.0 (సర్) రూపకల్పనలో నిమగ్నమైన బూత్ స్థాయి, ఇతర అధికారులకు బెదిరింపులు రావడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇలాంటివాటిని తమ దృష్టికి తీసుకురావాలని ఎన్నికల సంఘానికి సూచించింది. లేదంటే ఈ ధోరణి తీవ్ర గందరగోళానికి దారిస్తుందని హెచ్చరించింది. ‘సర్’ నిర్వహణలో ఎదురవుతున్న పరిస్థితులపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. జాబితా తయారీలో ఉన్న అధికారులకు ఆయా రాష్ట్రాలు సహకరించకపోతే తీవ్రంగా పరిగణించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్యా బాగ్చి సారథ్యంలోని ధర్మాసనం మంగళవారం ఈసీకి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించకపోవడం, ప్రక్రియలో ఆటంకాలు సృష్టించడం వంటి చర్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని.. అప్పుడు అధికారుల భద్రతకు సంబంధించి తగిన ఆదేశాలు జారీచేస్తామని ఈసీ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది రాకేశ్ ద్వివేదికి ధర్మాసనం సూచించింది. కాగా పరిస్థితి మరింత దిగజారితే రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉన్న పోలీసులను డిప్యుటేషన్లో ఉంచడం మినహా మార్గం లేదని ద్వివేది ఽపేర్కొన్నారు. అయితే.. ఈ దిశగా... ఎన్నికల ప్రక్రియ లాంఛనంగా మొదలయ్యేంతవరకు ఈసీ చర్యలు తీసుకోజాలదని ధర్మాసనం స్పష్టం చేసింది.