Speed Post: స్పీడ్ పోస్టు చార్జీల పెంపు
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:22 AM
దేశవ్యాప్తంగా స్పీడ్ పోస్టు చార్జీలు పెరిగాయి. పెరిగిన చార్జీలు అక్టోబరు 1 బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. స్పీడ్ పోస్టు చార్జీలను చివరిసారిగా..
పోస్టల్లోనూ ఇక నుంచి ఓటీపీ ఆధారిత డెలివరీ
అక్టోబరు 1 నుంచి అమల్లోకి
హైదరాబాద్, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా స్పీడ్ పోస్టు చార్జీలు పెరిగాయి. పెరిగిన చార్జీలు అక్టోబరు 1(బుధవారం) నుంచి అమల్లోకి రానున్నాయి. స్పీడ్ పోస్టు చార్జీలను చివరిసారిగా 2012లో సవరించారని, అప్పటి నుంచి చూస్తే ప్రస్తుతం నిర్వహణ ఖర్చులు పెరిగాయని, అందుకు అనుగుణంగా చార్జీలను హేతుబద్ధీకరించామని పోస్టల్ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా లెటర్లు, పార్సిళ్ల డెలివరీలకు సంబంధించి పలు కొత్త సదుపాయాలు, సేవలను పోస్టల్ శాఖ ప్రారంభించింది. ఇందులో ముఖ్యమైనది ఓటీపీ ఆధారిత డెలివరీ. ప్రస్తుత అమెజాన్, ఫ్లిప్కార్ట్లు ఎలాగైతే ఓటీపీ చెప్తేనే డెలివరీ చేస్తున్నాయో పోస్టల్ అధికారులు కూడా అలాగే డెలివరీ చేయనున్నారు. ఇందుకు వినియోగదారులు రూ.5అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు డెలివరీ సమయంలో ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థ, ఎస్ఎంఎస్ ఆధారిత డెలివరీ నోటిఫికేషన్లు, ఆన్లైన్ బుకింగ్ సేవలు, రియల్ టైమ్ డెలివరీ అప్డేట్లను తీసుకువచ్చింది. రిజిస్ట్రేషన్ పేరుతో కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చారు. రూ.5చెల్లించి రిజిస్ట్రేషన్ చేస్తే.. ఏ చిరునామాలో, ఎవరికి ఇవ్వాలని రిజిస్ట్రేషన్లో పేర్కొన్నారో వారికే లెటర్/పార్సిల్ను డెలివరీ చేస్తారు. ఇదిలా ఉండగా, విద్యార్థులకు స్పీడ్ పోస్టు చార్జీలపై 10ు తగ్గింపు వెసులుబాటు కల్పించారు.