Shashi Tharoor: పాక్లో ఉగ్రవాదులు మరణిస్తే సంతాపమా
ABN , Publish Date - May 31 , 2025 | 06:18 AM
ఆపరేషన్ సిందూర్లో మరణించిన ఉగ్రవాదులకు కొలంబియా సంతాపం తెలియజేయడం పై శశి థరూర్ అసహనం వ్యక్తం చేశారు. భారత్ పర్యటన బృందం కొలంబియా ప్రభుత్వానికి ఆ పరిస్థితేలు వివరించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.
కొలంబియా తీరుపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అసహనం
న్యూఢిల్లీ, మే 30: భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్థాన్లో ఉగ్రవాదులు చనిపోతే వారికి కొలంబియా సంతాపం తెలియజేయడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అసహనం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పాక్ అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు భారత పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు వివిధ దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శశిథరూర్ నేతృత్వంలోని బృందం కొలంబియా రాజధాని నగరంలో పర్యటించింది. ఈ సందర్భంగా ఆయన అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి సానుభూతి తెలియజేయకుండా.. భారత్ చేసిన దాడుల్లో పాక్లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలియజేయడం తమకు నిరాశ కలిగించిందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్కు దారితీసిన పరిస్థితులను కొలంబియా ప్రభుత్వానికి వివరించేందుకు తాము సిద్ధమని ఆయన వెల్లడించారు.