Vijay Kumar Malhotra Passes Away: బీజేపీ సీనియర్ నేత విజయ్ కుమార్ మల్హోత్రా కన్నుమూత
ABN , Publish Date - Oct 01 , 2025 | 01:43 AM
బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్రా(93) మంగళవారం ఉదయం ఢిల్లీలో కన్నుమూశారు. కొంతకాలంగా వయసు....
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్రా(93) మంగళవారం ఉదయం ఢిల్లీలో కన్నుమూశారు. కొంతకాలంగా వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎయిమ్స్లో చికిత్స పొందారు. బీజేపీకి ఒకప్పుడు ఢిల్లీలో పెద్దదిక్కుగా వ్యవహరించిన ఆయన, తన రాజకీయ జీవితంలో పలు కీలక స్థానాల్లో సేవలందించారు. ఐదు సార్లు ఎంపీగా, రెండు సార్లు ఢిల్లీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. 1999 లోక్సభ ఎన్నికల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై పోటీ చేసి గెలవడం ఆయన రాజకీయ జీవితంలో ముఖ్య ఘట్టంగా నిలిచింది. 2008 ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ, ఆ ఎన్నికల్లో షీలా దీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ విజయం సాధించింది. ప్రజల సందర్శనార్థం మల్హోత్రా పార్థివ దేహాన్ని బుధవారం ఢిల్లీలోని పండిత్ మార్గ్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో ఉంచనున్నారు. మల్హోత్రా మృతి పట్ల ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి సీపీ రాధా కృష్ణన్, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సంతాపం వ్యక్తం చేశారు.