Share News

Allahabad High Court: మతం మారితే ఎస్సీ హోదా కుదరదు! అది రాజ్యాంగాన్ని మోసం చేయటమే

ABN , Publish Date - Dec 03 , 2025 | 03:25 AM

ఇతర మతాల్లోకి మారిన తర్వాత కూడా ఎస్సీ హోదాను ఉపయోగించుకోవటం రాజ్యాంగాన్నే మోసం చేయటమని ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది...

Allahabad High Court: మతం మారితే ఎస్సీ హోదా కుదరదు! అది రాజ్యాంగాన్ని మోసం చేయటమే

  • అలహాబాద్‌ హైకోర్టు స్పష్టీకరణ

ప్రయాగ్‌రాజ్‌, డిసెంబరు 2: ఇతర మతాల్లోకి మారిన తర్వాత కూడా ఎస్సీ హోదాను ఉపయోగించుకోవటం రాజ్యాంగాన్నే మోసం చేయటమని ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు సంబంధిత ‘రాజ్యాంగ నిబంధన, 1950’ని ప్రస్తావించింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందినవారు కాకుండా ఇతర మతాల వారిని ఎస్సీ వర్గానికి చెందినవారిగా గుర్తించటం సాధ్యం కాదని ఆ నిబంధన స్పష్టం చేస్తోందని తెలిపింది. సూసాయ్‌, కేపీ మను, సీ సెల్వరాజ్‌ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరిస్తూ.. మతాంతీకరణ తర్వాత కూడా ఎస్సీ హోదాను ఉపయోగించుకోవటం రిజర్వేషన్‌ భావనకే విరుద్ధమని పేర్కొంది. కులపరమైన వివక్ష క్రైస్తవంతోపాటు పలు ఇతర మతాల్లో లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎస్సీ హోదాను పేర్కొంటూ హిందూ, బౌద్ధ, సిక్కుయేతర మతాలను పాటిస్తున్న వారి వివరాలను సేకరించాలని, వారు ఎస్సీ గుర్తింపును వాడుకోకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంఘిక, మైనారిటీ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. 4 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

మతాంతీకరణ అభియోగాలపై విచారణ

మహరాజ్‌గంజ్‌ జిల్లాకు చెందిన జితేంద్ర సహానీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. హిందూ దేవతల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, మతాంతీకరణను ప్రోత్సహిస్తున్నారంటూ తన మీద తప్పుడు అభియోగాలు నమోదయ్యాయని, వాటిని కొట్టేయాలని కోరుతూ జితేంద్ర సహానీ పిటిషన్‌లో అభ్యర్థించారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌గిరి మంగళవారం విచారణ జరిపారు. తన మీద నమోదైన అభియోగాలు అవాస్తవమని, అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతే తాను ప్రార్థనా సమావేశాలు నిర్వహిస్తున్నానని జితేంద్ర సహానీ పేర్కొన్నారు. కాగా విచారణ సందర్భంగా సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన జడ్జి.. జితేంద్ర సహానీ పుట్టుకతో హిందూ మతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, తర్వాత క్రైస్తవంలోకి మారారని, మతాధికారి (ప్రీస్ట్‌)గా పని చేస్తున్నారని గుర్తించారు. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో మాత్రం ఆయన తనను తాను హిందువుగా పేర్కొనటాన్ని ప్రశ్నించారు. జితేంద్ర సహానీ సమర్పించిన వివరాలను పరిశీలించి, ఆయన మతానికి సంబంధించిన వివరాల్లో తప్పులుంటే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

Updated Date - Dec 03 , 2025 | 03:25 AM