Rahul Gandhis Bihar Campaign Fails: సారీ.. సర్!
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:31 AM
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రె్స మహాగఠ్బంధన్ కూటమి మహా గట్టి ఓటమిని మూటగట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కూడా అంచనా వేయని స్థాయిలో పరాజయం పాలైం...
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై
రాహుల్ గాంధీ పోరాటం ప్రభావం శూన్యం!
పట్నా, నవంబరు 14: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రె్స మహాగఠ్బంధన్ కూటమి మహా గట్టి ఓటమిని మూటగట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కూడా అంచనా వేయని స్థాయిలో పరాజయం పాలైం ది. బిహార్ ఎన్నికల వేదికగా రాహుల్ గాంధీ పేల్చిన ఓటు చోరీ ‘హైడ్రోజన్ బాంబు’ తుస్సుమంది. ఆయన 1,300 కిమీ మేర చేపట్టిన ‘ఓటర్ అధికార యాత్ర’ ఏమాత్రం ప్రభావం చూపలేదు. దానికితోడు కూటమిలో సీట్ల పంపకాల లుకలుకలు, అలవిమాలిన హామీలపై ప్రజల్లో అసంతృప్తి కనిపించింది. లాలూ ‘జంగిల్ రాజ్’ నేపథ్యంతోనూ దెబ్బపడింది. కూటమిలోని ఆర్జేడీ 25 సీట్లలో, కాంగ్రెస్ 6, సీపీఐఎంల్ 2, సీపీఐ ఒక స్థానంలోనే విజయం సాధించగలిగాయి.
గురి తప్పిన ఓటు చోరీ!
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రాహుల్ గాంధీ ఓటు చోరీ ఆరోపణలను బిహారీలు పట్టించుకోలేదు. మీడియాలో, సోషల్ మీడియాలో రాహుల్ ఆరోపణలు, ఓటర్ అధికార యాత్ర, ఎస్ఐఆర్ పేరిట ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారన్న ఆరోపణలకు ప్రచారం లభించడంతో.. మహాగఠ్బంధన్ కూటమి కూడా దీన్నే ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకుంది. కానీ క్షేత్రస్థాయిలో ఓటర్లపై ఈ అంశాలేవీ ప్రభావం చూపలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు మినహా స్థానిక అంశాలపై పెద్దగా దృష్టిపెట్టకపోవడం వంటివి ఓటర్లను ఆకట్టుకోలేకపోయాయి.
అలవిమాలిన హామీలతోనూ దెబ్బ
బిహార్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని మహాగఠ్బంధన్ కూటమి ఇచ్చిన అలవిమాలిన హామీలు ఓటర్లను ఆకట్టుకోకపోగా, వ్యతిరేక ప్రభా వం చూపాయి. తమ కూటమి అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోగా బిహార్లో ఇం టికొక ప్రభుత్వ ఉద్యో గం ఇస్తామని ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ చేసిన ప్రకటన విస్మ యం కలిగించింది. సుమారు 2.76 కోట్ల మందికి ఉద్యోగాలు ఎలా ఇస్తారనే చర్చ జరిగింది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామన్న హామీపై యువతలో వ్యతిరేకత వ్యక్తమైంది.
కూటమిలో లుకలుకలు,స్నేహపూర్వక పోటీ..
బిహార్లో ఈసారి గెలిచే అవకాశం ఉందన్న భావనతో మహాగఠ్బంధన్ కూటమి పక్షాలన్నీ ఎక్కువ సీట్లలో పోటీ కోసం పట్టుబట్టాయి. ముఖ్యంగా కాంగ్రె స్ క్షేత్రస్థాయిలో ఉన్న బలం కన్నా ఎక్కువ సీట్లు అడిగింది. అభ్యర్థుల ఎంపిక, వనరుల పంపిణీ, ప్రచారంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం కొరవడిం ది. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు తరచూ కల్పించుకుని చర్చలు జరపాల్సి వచ్చింది. కూటమిగా పోటీ చేసినా.. 12 చోట్ల కాంగ్రెస్, ఆర్జేడీ అభ్యర్థులు స్నేహపూర్వక పోటీలో ఉండటం.. కూటమి లుకలుకలపై ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు పం పింది. సీట్ల పంపిణీపై అసంతృప్తితో జేఎంఎం పార్టీ కూటమిని వీడటం కూడా ప్రభావం చూపింది.
కొన్ని వర్గాల ఓట్ల పైనే దృష్టిపెట్టడం..
మహాగఠ్బంధన్ కూ టమి ప్రధానంగా ము స్లింలు, యాదవ్ల ఓ ట్లనే నమ్ముకోవడమూ దెబ్బతీసిం ది. కూటమి తరఫున ఏకంగా 52 మందికిపైగా యాదవ్లకే టికెట్లివ్వడం ఇతర వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. తొలి నుంచీ ఆర్జేడీ వెంట ఉన్న దళితులు ఈసారి బీజేపీకి మద్దతునిచ్చారు. నితీశ్కు మద్దతుగా నిలుస్తూ వచ్చిన ఈబీసీలను ఆకట్టుకునేందుకు ఈ కూటమి ప్రయత్నించినా సఫలం కాలేదు. అదే టైంలో కాంగ్రె్సకు మద్దతుగా ఉంటూ వచ్చిన అగ్రవర్ణాల ఓట్లూ ఈసారి బీజేపీ వైపు మళ్లాయి.
రాహుల్ గాంధీకి.. నో సర్..
బిహార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసి 19 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్.. ఈసారి 61 స్థానాల్లో పోటీ చేసి, కేవలం 6 సీట్లలోనే గెలిచింది. అంటే కేవలం 6ు సీట్లలోనే విజయం సాధించింది. కాంగ్రె్సకు కాసింత బలమున్న సీమాంచల్, మిథిల, మగధ ప్రాంతాల్లోనూ దారుణంగా దెబ్బ తగిలింది. ఓటు చోరీ ఆరోపణలు, హైడ్రోజన్ బాంబు వంటి ప్రకటనలతో విశేష ప్రచారం లభించినా.. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్ - సర్’)ను తప్పుబడుతూ ఓటరు అధికార యాత్ర పేరిట బిహార్లో రాహుల్ గాంధీ కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఓటర్లు ఆదరించలేదు. కాంగ్రెస్ పార్టీకి బలమైన రాష్ట్ర నేత లేకపోవడం కూడా ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ దెబ్బవల్ల మొత్తంగా కూటమి సీట్లూ దారుణంగా తగ్గాయి
తేజస్విని వీడని ‘జంగిల్ రాజ్’!
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించి బిహార్ భావి సీఎం అన్న స్థాయిలో ప్రచారం పొందిన తేజస్వియాదవ్కు తాజా ఫలితాలు చుక్కలు చూపించాయి. 143 సీట్లలో పోటీ చేసిన ఆర్జేడీ కేవలం 25 సీట్లే.. అంటే 20శాతమే గెలుచుకుంది. ఎన్డీయే కూట మి హవాకు తోడు లాలూ కుటుంబ పాలన సమయంలో బిహార్లో అరాచకాలకు పేరుపడిన ‘జంగిల్ రాజ్’ కూడా గట్టి ప్రభావమే చూపింది. ఎన్డీయే కూట మి తమ ప్రచారంలో నితీశ్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూనే.. ఆర్జేడీ, కాంగ్రెస్ కూట మి గెలిస్తే బిహార్ మళ్లీ ‘జంగిల్ రాజ్’లోకి వెళ్లిపోతుందన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో గుప్పించింది. ప్రధాని మోదీ కూడా స్వయంగా జంగిల్ రాజ్ ఆరోపణలు చేశారు. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆర్జేడీ ఈసారి 25 సీట్లకు పడిపోవడం గమనార్హం.
రాహుల్ యాత్ర చేసిన అన్ని సీట్లలో ఓటమి
ఈ ఏడాది ఆగస్టులో బిహార్లో రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటరు అధికార యాత్ర’ కొనసాగిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. 25 జిల్లాల్లోని 110 స్థానాల్లో 1,300 కిమీ మేర రాహుల్ ఈ యాత్ర చేశారు. నిజానికి లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్రలు పార్టీకి కొత్త ఊపిరినిచ్చాయి. రాహుల్ యాత్ర మార్గంలో 41 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఆ విజయాలకు మరెన్నో కారణాలున్నా.. బిహార్లో యాత్రతోనూ సానుకూల ఫలితం ఉంటుందని కాంగ్రెస్ ఆశించింది. కానీ పరిస్థితి తలకిందులైంది.