Supreme Court India: ఉగ్రవాదులపై స్పైవేర్ వాడితే తప్పేంటి
ABN , Publish Date - Apr 30 , 2025 | 05:49 AM
పెగాసస్ను ఉగ్రవాదులపై వాడితే తప్పేంటని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశ భద్రతకు సంబంధించిన నివేదికలను బహిర్గతం చేయడం కుదరదని స్పష్టం చేసింది.
దేశ భద్రత విషయంలో రాజీపడనక్కర్లేదు
ప్రైవేటు వ్యక్తులపై వాడితే దర్యాప్తు చేయిస్తాం
నిపుణుల నివేదికను బహిర్గతపర్చలేం: సుప్రీం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: పెగాసస్ స్పైవేర్ను ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వాడితే తప్పేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాగే దేశ భద్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన అంశాలను స్పృశించిన ఏ నివేదికనైనా బహిర్గతం చేయడం కుదరదని తెలిపింది. ఇజ్రాయెల్కు చెందిన పెగాసస్ స్పైవేర్ను వినియోగించి దేశంలోని పాత్రికేయులు, రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ అత్యున్నత న్యాయస్థానంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై మంగళవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం దేశం స్పైవేర్ను కలిగి ఉండడం తప్పులేదని కోర్టు స్పష్టంచేసింది. అయితే, అది ఎలా? ఎవరిపై ఉపయోగించారన్న దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఓ పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. పెగాసస్ స్పైవేర్ను ఉపయోగిస్తున్నారా? లేదా అన్న విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేగాక, ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపిన సాంకేతిక నిపుణుల బృందం నివేదికను ఇప్పటివరకూ బహిర్గతపర్చలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
దాన్ని వెంటనే బహిర్గతం చేయాలని కోరారు. స్పందించిన ధర్మాసనం.. ‘‘ఉగ్రవాదులపై దేశం స్పైవేర్ను వినియోగిస్తే తప్పేముంది? స్పైవేర్ను కలిగి ఉండడం తప్పేమీ కాదు. అయితే, దాన్ని ఎవరి మీద వాడుతున్నారన్నదే ప్రశ్న. దేశ భద్రత విషయంలో రాజీపడాల్సిన అవసరం లేదు. అదేసమయంలో ప్రైవేటు వ్యక్తులు, పౌరసమాజానికి రాజ్యాంగం కల్పించిన గోప్యత హక్కును కూడా పరిరక్షించాల్సి ఉంటుంది’’ అని వ్యాఖ్యానించింది. జర్నలిస్ట్ పరంజయ్ గుహ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదిస్తూ.. ఫోన్ల హ్యాకింగ్ విషయాన్ని వాట్సాప్ సంస్థే వెల్లడించిందని గుర్తుచేశారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఉగ్రవాదులపై స్పైవేర్ను వినియోగించడంలో ఎలాంటి తప్పూ లేదన్నారు. వారికి గోప్యత హక్కులేమీ ఉండవని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. స్పైవేర్ను ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వాడుకుంటే తప్పేమీ లేదంది. సామాన్యులపై ఉపయోగిస్తే, దానిపై తాము దర్యాప్తు జరిపిస్తామని తెలిపింది. ఇక, సాంకేతిక బృందం నివేదిక గురించి మాట్లాడుతూ.. ‘‘దేశ భద్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన నివేదికను బహిర్గతం చేయడం సరికాదు. ఒకవేళ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే.. వారికి సమాచారం అందిస్తాం. అంతేగానీ వీధుల్లో చర్చించుకునే పత్రంగా ఈ నివేదిక మారకూడదు’’ అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పహల్గాం ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసు. మనం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..