Parameshwara: నేనూ సీఎం రేసులో ఉన్నా!
ABN , Publish Date - Nov 24 , 2025 | 03:48 AM
కర్ణాటక సీఎం రేసులో తానూ ఉన్నానని హోంమంత్రి పరమేశ్వర్ ప్రకటించారు. ఆదివారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎప్పటి నుంచో సీఎం రేసులో ఉన్నానని...
కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ ప్రకటన
తెరపైకి దళిత ముఖ్యమంత్రి డిమాండ్
బెంగళూరు, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): కర్ణాటక సీఎం రేసులో తానూ ఉన్నానని హోంమంత్రి పరమేశ్వర్ ప్రకటించారు. ఆదివారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎప్పటి నుంచో సీఎం రేసులో ఉన్నానని, దళిత నేత సీఎం కావాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉందని అన్నారు. అయితే, 2023లో సీఎం ఎంపిక సందర్భంగా రెండున్నరేళ్ల తర్వాత మార్పు అన్న అంశం చర్చకు రాలేదన్నారు. మధ్యలో అధిష్ఠానం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని, అధిష్ఠానం అన్నింటినీ పరిశీలిస్తుందని చెప్పారు. ‘గతంలో బంగారప్పను మార్చి వీరప్ప మొయిలీని చేయలేదా?’ అని ప్రశ్నించారు. అయితే, ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉందని తాను భావించడం లేదన్నారు. రాహుల్గాంధీ విదేశాల నుంచి వచ్చాక చర్చలు జరగవచ్చన్నారు.
పరిణామాలను పరిశీలిస్తున్నా: ఖర్గే
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక కాంగ్రె్సలో పరిణామాలను పరిశీలిస్తున్నానన్నారు. తాను ఏమీ చెప్పనని, దీనిపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అధిష్ఠానం నిర్ణయాన్ని తనతోపాటు డీకే శివకుమార్ సహా అందరూ అంగీకరించాల్సిదేనన్నారు. కాగా, అధికార పోరాటంలో అధిష్ఠానం జాప్యం చేస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిద్దరామయ్య, శివకుమార్ గ్రూపులు సహా ప్రస్తుతం కర్ణాటక కాంగ్రె్సలో నాలుగు గ్రూపులు ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరుతున్నాయి. అధిష్థానం జాప్యం చేస్తే పార్టీకి నష్టం తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.