Online Registration: దేశవ్యాప్తంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో!
ABN , Publish Date - May 29 , 2025 | 05:27 AM
భూములు, ఇతర ఆస్తులు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత పారదర్శకం, సులభతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
కొత్త చట్టం తీసుకురానున్న కేంద్ర ప్రభుత్వం
ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ
భూములు, ఇతర ఆస్తుల నమోదు ఇకపై సులువు
న్యూఢిల్లీ, మే 28 : భూములు, ఇతర ఆస్తులు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత పారదర్శకం, సులభతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకురానుంది. దేశ వ్యాప్తంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేయనుంది. ఇందుకోసం 117 ఏళ్లుగా అమలులో ఉన్న రిజిస్ట్రేషన్ చట్టం స్థానంలో ఓ కొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అమలు చేసేందుకు వీలుగా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రస్తుతమున్న రిజిస్ట్రేషన్ చట్టంలో మార్పులు చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్రం నూతన చట్టంపై దృష్టి పెట్టింది. నూతన చట్టం అమలులోకి వస్తే ప్రజలు తమ భూములు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ఆన్లైన్లోనే చేసుకోవడమే కాక.. అందుకు సంబంధించిన పత్రాలను ఈ-సర్టిఫికెట్ల రూపంలో పొందవచ్చు. ఈ నూతన చట్టం పవర్ ఆఫ్ అటార్నీ, విక్రయ ఒప్పందాలు, సేల్ సర్టిఫికెట్లు, తనఖా ఒప్పందాల వంటి పత్రాల రిజిస్ట్రేషన్నూ తప్పనిసరి చేయనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కు చెందిన భూవనరుల విభాగం ఈ నూతన చట్టానికి సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసింది. ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే రిజిస్ట్రేషన్ చట్టం దేశవ్యాప్తంగా అమలు అవుతుంది. అయితే, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి చట్టంలో కొన్ని సవరణలు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది.
ఆధార్ ఆధారిత ధ్రువీకరణ
ప్రతిపాదిత నూతన చట్టం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో చేయడం, ఆయా రికార్డులను డిజిటల్గా భద్రపరచడాన్ని తప్పనిసరి చేయనుంది. అంతేకాక, రిజిస్ట్రేషన్కు అవసరమైన పత్రాలను ఆన్లైన్లో సమర్పించేందుకు అవకాశం ఇస్తుంది. అయితే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆధార్ కార్డు ధ్రువీకరణతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ కార్డు సంఖ్యతో అనుసంధానమైన మొబైల్ నెంబర్కు ఓటీపీ పంపడం ద్వారా ఈ ధ్రువీకరణ చేపట్టే అవకాశం ఉంది. అలాగని ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. ఆధార్ వివరాలు ఇవ్వడం ఇష్టం లేని వారికోసం వేరే ఐచ్ఛికాలను ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ నూతన విధానం వల్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో అవినీతి, మోసాలు తగ్గుతాయని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం, వేగవంతం అవుతుందని కేంద్రం భావిస్తోంది.