Share News

NIA Investigation: తిహాడ్‌కు రాణా

ABN , Publish Date - Apr 11 , 2025 | 06:24 AM

అమెరికా నుంచి భారత్‌కు తరలింపైన ముంబై మారణహోమం సూత్రధారి తహవ్వుర్‌ రాణాను, ఎన్‌ఐఏ అధికారులు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో కోర్టుకు తీసుకెళ్లారు. 2008 నవంబరులో ముంబై ఉగ్రదాడికి సంబంధించి రాణా కీలక పాత్ర పోషించాడు

NIA Investigation: తిహాడ్‌కు రాణా

  • ముంబై మారణహోమం సూత్రధారి అమెరికా నుంచి భారత్‌కు తరలింపు

  • బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో కోర్టుకు

  • ఎన్‌ఐఏ కోర్టుకు.. అనంతరం తిహాడ్‌కు

  • ఎన్‌ఐఏ ఆఫీసులో విచారించనున్న

  • సైకాలజిస్టులతో కూడిన ప్రత్యేక బృందం

  • మోదీ ప్రభుత్వ దౌత్యనీతి విజయమిది: షా

  • అది మేం మొదలుపెట్టిన పని మోదీ గొప్పతనమేమీ లేదు: చిదంబరం

  • తహవ్వుర్‌ రాణా కెనడా పౌరుడు..మాకు సంబంధం లేదు: పాకిస్థాన్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 10: అమెరికా కోర్టుల్లో న్యాయ పోరాటాలు.. దౌత్యపరమైన ఒత్తిళ్లు.. ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా జరిగిన 15 ఏళ్లపాటు జరిగిన విచారణలు.. అన్నీ ముగిసి ముంబై మారణహోమం సూత్రధారి తహవ్వుర్‌ రాణాను భారత్‌కు తీసుకువచ్చే ప్రక్రియ పూర్తయింది. అమెరికాలోని లాస్‌ఏంజిలిస్లో సలో అక్కడి అధికారుల నుంచి రాణాను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలం ఎయిర్‌వేస్‌లోవిమానం ల్యాండ్‌ అయింది. అక్కడే రాణాను లాంఛనంగా అరెస్టు చేసిన ఎన్‌ఐఏ అధికారులు.. వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో పటియాలా హౌస్‌ ఎన్‌ఐఏ కోర్టుకు తరలించి న్యాయమూర్తి చందర్‌జిత్‌ సింగ్‌ ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు తీహాడ్‌ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా రాణాను తరలించే మార్గాల్లో, కోర్టు పరిసరాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రాణా వయసు ప్రస్తుతం 64 ఏళ్లు.

166 మందిని బలిగొన్న మారణ హోమం..

కసబ్‌ సహా పది మంది లష్కరే తాయిబా ఉగ్రవాదులు 2008 నవంబరు 26న పాకిస్థాన్‌ నుంచి సముద్ర మార్గంలో ముంబైకి చేరుకుని దారుణ మారణహోమానికి పాల్పడిన విషయం తెలిసిందే. 166 మంది ప్రాణాలను బలిగొన్న ఆ ఉగ్రదాడికి పాల్పడినవారిలో కసబ్‌ ఒక్కడు ప్రాణాలతో పట్టుబడ్డాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ).. అమెరికా జాతీయుడు డేవిడ్‌ హెడ్లీ, పాకిస్థాన్‌ సంతతికి చెందిన కెనడా పౌరుడు తహవ్వుర్‌ రాణా కీలక సూత్రధారులుగా తేల్చింది.


పాక్‌లో పుట్టి.. కెనడా పౌరుడిగా మారి..

పాకిస్థాన్‌కు చెందిన రాణా.. ఆ దేశ సైన్యంలో వైద్యుడిగా పనిచేశాడు. అప్పుడే పాక్‌ నిఘా సంస్థ ఐఎ్‌సఐతో సంబంధాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో లష్కరేతాయిబా ఉగ్రవాది, అమెరికన్‌ పౌరుడు డేవిడ్‌ హెడ్లీ అలియాస్‌ దావూద్‌ గిలానీతో పరిచయం ఏర్పడింది. 1997లో రాణా కెనడాకు వలసవెళ్లాడు. ఇమిగ్రేషన్‌కు సంబంధించి పలు వ్యాపారా లు చేశాడు. 2001లో కెనడా పౌరసత్వం పొందాడు. ఆ తర్వాత అమెరికాలోని చికాగోకు చేరుకుని ఇమిగ్రేషన్‌ ఏజెన్సీని ఏర్పాటు చేశాడు. నిజానికి లష్కరేతాయిబా సంస్థ ఉగ్రదాడులు, ఉగ్రవాదులు వివిధ దేశాలకు ప్రయాణించేందుకు ఈ సంస్థను అడ్డుపెట్టుకున్నారన్న విషయం తర్వాత బయటపడింది. మరోవైపు డేవిడ్‌ హెడ్లీ లష్కరేతాయిబాలో భారీ ఉగ్రదాడులపై ప్రత్యేకంగా శిక్షణ పొందాడు. ఆ సమయంలో రాణా, హెడ్లీ తరచూ సంప్రదింపుల్లో ఉండేవారు. ఈ క్రమంలోనే భారత్‌లో భారీ దాడులకు ప్లాన్‌ వేశారు. రాణా సాయంతో హెడ్లీ ముంబైలో ‘ఫస్ట్‌ వరల్డ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌’ పేరిట ఏజెన్సీని ఏర్పాటు చేశాడు. లష్కరేతాయిబా, ఐఎ్‌సఐల సూచనల మేరకు.. ముంబైలో తాజ్‌ హో టల్‌, ఒబెరాయ్‌ హోటల్‌, నారీమన్‌ పాయింట్‌ వద్ద రెక్కీ చేసి, మ్యాపులు రూపొందించాడు. అమెరికా మీదుగా పాక్‌ వెళ్లి వివరాలన్నీ లష్కరేతాయిబా, ఐఎ్‌సఐ బాసులకు అందజేసి.. ఉగ్రదాడులకు రూపకల్పన చేశారు. ఈ క్రమంలో రాణా, హెడ్లీ 231 సార్లు మాట్లాడుకున్నట్టు ఎన్‌ఐఏ గుర్తించింది. మరోవైపు రాణా కూడా దాడులకు ముందు సెప్టెంబర్‌ 13 నుంచి 21 వరకు వైద్యురాలైన తన భార్యతో కలిసి భారత్‌లో పర్యటించాడు. తాజ్‌మహల్‌ వద్ద, ముంబైలో, కేరళలోని కోచిలో రెక్కీ చేసి వెళ్లాడు. తర్వాత ఐదు రోజులకే ముంబైలో ఉగ్రదాడి జరిగింది. కుంభమేళాలో ఉగ్రదాడికి కూడా రాణా ప్రణాళిక వేసినట్టు గుర్తించారు.


చట్టపరంగా... దౌత్యపరంగా..

భారత్‌ చట్టపరంగా, దౌత్యపరంగా చాకచక్యంగా వ్యవహరించడంతోనే రాణా అప్పగింత సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు. ముంబై పేలుళ్లతోపాటు డెన్మార్క్‌లోని ఓ వార్తాపత్రిక కార్యాలయంపై ఉగ్రదాడికి సంబంధించిన కేసులలో 2009లో రాణాను అమెరికా పోలీసులు అరెస్టు చేశా రు. విచారణ జరిపిన అక్కడి కోర్టు ముంబై పేలుళ్ల వ్యవహారంలో నేరుగా సంబంధం లేదని కొట్టివేసింది. కానీ డెన్మార్క్‌ కేసులో 2013 జనవరిలో అతడికి 14 ఏళ్లు జైలుశిక్ష విధించింది. అప్పటి నుంచి జైల్లో ఉన్న రాణాను ముంబై ఉగ్రదాడి కేసు విచారణ కోసం అప్పగించాలని భారత్‌ అమెరికాపై ఒత్తిడి తెచ్చింది. దీనిపై అమెరికా కోర్టుల్లో పిటిషన్లు వేసి పోరాడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాణా అప్పగింతకు అమెరికా విదేశాంగశాఖ అనుమతి ఇచ్చింది. అప్పగింత నిర్ణయానికి వ్యతిరేకంగా రాణా అమెరికన్‌ కోర్టుల్లో వరుస గా పిటిషన్లు వేశాడు. పలుమార్లు గుండెపోటు వచ్చిందని, తీవ్రమైన కిడ్నీల వ్యాధి ఉందని.. తాను పాక్‌ ఆర్మీ మాజీ అధికారి కావడం, ముస్లిం కావడం వల్ల హింసించే అవకాశం ఉందని అతని తరఫు న్యాయవాదులు వాదించారు. భారత్‌కు అప్పగిస్తే తన ప్రాణాలకు ప్రమాదమని పేర్కొన్నారు. ముంబై పేలుళ్ల కేసులో అమెరికా కోర్టు తనను అప్పటికే విచారించిందని, అదే కేసులో భారత్‌కు అప్పగించడం ‘డబుల్‌ జియోపార్డీ (ఒకే కేసులో రెండు సార్లు విచారించడాన్ని నిరోధించే) చట్టం‘ను ఉల్లంఘించడమేనని వాదించారు. అయితే ముంబై మారణహోమానికి అతను సూత్రధారి అని, విచారించాల్సి ఉందని భారత న్యాయ నిపుణులు వాదించారు. ఈ కేసులో ‘డబుల్‌ జియోపార్డీ’ వర్తించదని అమెరికా కోర్టులకు వివరించి ఒప్పించారు. రాణా భద్రతకు, న్యాయపరమైన హక్కుల కల్పనకు హామీ ఇస్తున్నట్టు వివరించారు. మరోవైపు దౌత్యపరంగానూ అమెరికాపై ఒత్తిడి తెచ్చి రాణా అప్పగింతకు అంగీకరించేలా చే యడంలో భారత్‌ సఫలమైందని నిపుణులు చెబుతున్నారు.

ఎన్‌ఐఏ తరఫున దయాన్‌ కృష్ణన్‌, నరేందర్‌ మన్‌..

ముంబై ఉగ్రదాడి కేసు చాలా కీలకమైనది కావడంతో ఎన్‌ఐఏ తరఫున కోర్టుల్లో వాదించడానికి సీనియర్‌ న్యాయవాది నరేందర్‌ మన్‌ను స్పెషల్‌ ప్రాసిక్యూటర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎన్‌ఐఏ తరఫున అమెరికా కోర్టుల్లో వాదించిన సీనియర్‌ న్యాయవాది దయాన్‌ కృష్ణన్‌తో కలిసి నరేందర్‌ మన్‌ వాదనలు వినిపించనున్నారు. ఇక తహవ్వుర్‌ రాణాకు న్యాయ సహాయంలో భాగంగా ఢిల్లీ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ నుంచి పీయూష్‌ సచ్‌దేవ వాదనలు వినిపించనున్నారు.


అధికారులు, సైకాలజిస్టులతో విచారణ!

లష్కరేతాయిబా ఉగ్రవాద సంస్థలో కఠిన శిక్షణ పొందిన తహవ్వుర్‌ రాణా నుంచి సమాచారం రాబట్టడం అంత తేలికకాదని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ‘‘అమెరికాలో అతడిని ఇప్పటికే తీవ్రస్థాయిలో విచారణ చేశారు. ఎలా తప్పుదోవ పట్టించాలో అతడికి తెలుసు. ఎన్‌ఐఏ అధికారులతోపాటు నిఘా ఏజెంట్లు, నేర ప్రవర్తన-ఉగ్రవాద నిరోధక అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ పొందిన సైకాలజిస్టులతో కూడిన బృందం రాణాను విచారించి సమాధానాలు రాబడుతుంది. ఇందుకు కొంత ఎక్కువ సమయమే పట్టొచ్చు..’’ అని పేర్కొంటున్నాయి. కాగా ఢిల్లీలోని ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయంలో ఉన్న ప్రత్యేకమైన సెల్‌లో రాణాను విచారిస్తారని నిఘా వర్గాలు తెలిపాయి. ఎన్‌ఐఏ డీజీ సదానంద్‌ దతే, ఐజీ అశీశ్‌ బాత్రా, డీఐజీ జయరాయ్‌ సహా 12 మంది అధికారులకు మాత్రమే అందులోకి ప్రవేశించే అనుమతి ఉంటుందని వెల్లడించాయి.

నాటి దాడిలో గాయపడి.. నేడు ఎన్‌ఐఏ చీఫ్‌గా..

ప్రస్తుతం ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న సదానంద్‌ దాతే.. నాడు ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలకు తెగించి పోరాడటం విశేషం. అప్పట్లో ముంబై అదనపు పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న సదానంద్‌ దాతే.. ఉగ్రవాద దాడుల విషయం తెలిసి స్వయంగా రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఉగ్రవాది కసబ్‌ విసిరిన గ్రనేడ్‌ పేలి తీవ్రంగా గాయపడ్డారు. నాడు చూపిన తెగువకు రాష్ట్రపతి పోలీస్‌ మెడల్‌ కూడా అందుకున్నారు.

రాణాతో మాకు సంబంధం లేదు: పాకిస్థాన్‌

ఉగ్రవాది రాణా విషయంలో పాకిస్థాన్‌ కప్పగంతులు వేస్తోంది. అమెరికా రాణాను భారత్‌కు అప్పగించిన నేపథ్యంలో పాక్‌ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రాణా ప్రస్తుతం తమ దేశ పౌరుడు కాదని, గత 20 ఏళ్లలో ఎప్పుడూ అతను పాకిస్థాన్‌కు చెందిన ఎలాంటి ధ్రువపత్రాలను పునరుద్ధరించుకోలేదని తెలిపింది. రాణా కెనడా పౌరుడని పేర్కొంది. అయితే రాణాకు పాక్‌ సైన్యం, ఐఎ్‌సఐలోని కీలక వ్యక్తులతో సంబంధాలున్నాయని.. ఎన్‌ఐఏ విచారణ లో కీలకఅంశాలు, రహస్యాలను బయటపెట్టవచ్చనే ఆందోళన పాక్‌లో వ్యక్తమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.


హెడ్లీని మాత్రం రప్పించలేం!

ముంబై ఉగ్రదాడి సూత్రధారుల్లో ఒకరైన డేవిడ్‌ హెడ్లీని మాత్రం భారత్‌కు రప్పించలేమని నిఘా వర్గాలు చెబుతున్నాయి. హెడ్లీ అమెరికా పౌరుడు కావడం, అమెరికా దర్యాప్తు సంస్థలకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించడంతోపాటు 2010లో అమెరికా దర్యాప్తు అధికారులతో కుదుర్చుకున్న ఒప్పందం దీనికి కారణమని వివరిస్తున్నాయి. ‘‘ఉగ్రవాద కేసుల్లో అరెస్టైన హెడ్లీ.. 2010లో అమెరికా అధికారులతో చట్టపరమైన ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముంబై దాడులు, లష్కరేతాయిబాతో, పాక్‌ ఐఎ్‌సఐతో సంబంధాలు, కార్యకలాపాల సమాచారమంతా వెల్లడించాడు. బదులుగా తనను భారత్‌, పాకిస్థాన్‌, డెన్మార్క్‌ దేశాలకు అప్పగించవద్దని ఒప్పందం చేసుకున్నాడు..’’ అని నిఘా వర్గాలు తెలిపాయి. అంతేగాకుండా అమెరికా నిఘా, దర్యాప్తు సంస్థలకు హెడ్లీ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించిన నేపథ్యంలో.. సంబంధిత కీలక సమాచారం బయటపడకుండా ఉండేందుకు కూడా అతడిని ఇతర దేశాలకు అప్పగించే అవకాశం లేదని వెల్లడించాయి.

మోదీ ప్రభుత్వ దౌత్యనీతి విజయమిది: అమిత్‌ షా

ఉగ్రవాది తహవ్వుర్‌ రాణాను భారత్‌కు తీసుకురావడం మోదీ ప్రభుత్వ దౌత్యనీతి విజయమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అభివర్ణించారు. గతంలోని యూపీఏ ప్రభుత్వం ఈ పనిచేయలేకపోయిందని పరోక్షంగా విమర్శించారు. ‘‘మన గడ్డమీద, మన ప్రజల మీద దాడి చేసినవారిని రప్పించి శిక్షించడం భారత ప్రభుత్వ విధి. కానీ ముంబై ఉగ్రదాడి జరిగినప్పుడున్న ప్రభుత్వం రాణాను రప్పించలేకపోయింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వ దౌత్యనీతితో విజయం సాధించింది’’ అని అమిత్‌ షా కార్యాలయం ప్రకటించింది. ఇక కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు రాజకీయాలతో ఉగ్రవాదం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా విమర్శించారు. మోదీ ప్రభుత్వం రాణాను రప్పించి నాటి మృతుల కుటుంబాలకు న్యాయం చేసిందని పేర్కొన్నారు.

మేం మొదలుపెట్టిందే పూర్తిచేశారు: చిదంబరం

రాణా అప్పగింత విషయంలో మోదీ ప్రభుత్వం చేసినదేమీ లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘రాణా అప్పగింతను మోదీ ప్రభుత్వం తమ గొప్పగా చెప్పుకునేందుకు ఆరాటపడుతోంది. కానీ రాణాను రప్పించేందుకు యూపీఏ ప్రభుత్వమే ప్రక్రియ మొదలుపెట్టింది. ఒకటిన్నర దశాబ్దాల పాటు చట్ట, దౌత్య, నిఘా పరమైన పోరాటంతోనే ఇది సాధ్యమైంది’’ అని పేర్కొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 06:25 AM