India US Relation: ట్రంప్తో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ
ABN , Publish Date - Dec 12 , 2025 | 03:57 AM
ప్రధానమంత్రి మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో గురువారం ఫోన్లో మాట్లాడారు. భారత్-అమెరికాల మధ్య సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంపై......
ద్వైపాక్షిక బంధం పురోగతిపై సమీక్ష
స్నేహపూర్వకంగా సంభాషణ జరిగిందని ప్రధాని వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబరు 11: ప్రధానమంత్రి మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో గురువారం ఫోన్లో మాట్లాడారు. భారత్-అమెరికాల మధ్య సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరువురు నేతలు సమీక్షించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో వృద్ధిపై నేతలిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచుకోవడంపైనా చర్చించినట్లు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సంక్లిష్ట సాంకేతికతలు, ఇంధనం, రక్షణ, భద్రత రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. 21 శతాబ్దపు ప్రయోజనాల కోసం భారత్-అమెరికా ‘కాంపాక్ట్ (సైనిక భాగస్వామ్యం; వాణిజ్యం, సాంకేతికతల్లో మరింత సహకరించుకోవడం)’ కార్యక్రమ అమలుపై కూడా మాట్లాడుకున్నట్లు వెల్లడించారు. కీలకమైన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా మోదీ, ట్రంప్ చర్చించినట్లు తెలిపారు. పుతిన్ భారత పర్యటన అనంతరం మోదీ-ట్రంప్ సంభాషించుకోవడం ఇదే తొలిసారి. కాగా, భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిపై ట్రంప్తో సమీక్షించినట్లు మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో స్నేహపూర్వక, ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని మేం సమీక్షించాం. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైనా చర్చించాం. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం భారత్-అమెరికాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయి’’ అని ప్రధాని పేర్కొన్నారు.