LPG Dealers: కమీషన్ పెంపు కోసం వంట గ్యాస్ డీలర్ల సమ్మె హెచ్చరిక
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:45 AM
వృద్ధి చెందుతున్న నిర్వహణ వ్యయాల నేపథ్యంలో గ్యాస్ డీలర్లు కమీషన్ రూ.150కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే మూడు వారాల్లో దేశవ్యాప్త సమ్మె చేస్తామని హెచ్చరించారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: తమ సమస్యలను పరిష్కరించకుంటే దేశ వ్యాప్త సమ్మె చేస్తామని వంటగ్యాస్ డీలర్లు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇందుకు మూడు వారాల సమయం ఇస్తున్నట్టు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు బి.ఎ్స.శర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పెట్రోలియం, సహజవాయుల మంత్రిత్వ శాఖకు కూడా లేఖ రాసినట్టు తెలిపారు. సిలిండర్ల పంపిణీకి సంబంధించిన నిర్వహణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా ప్రస్తుతం ఇస్తున్న కమీషన్ సరిపోవడం లేదని, అందువల్ల దాన్ని కనీసం రూ.150కి పెంచాలని డిమాండు చేశారు. తాము అడగకపోయినా ఆయిల్ కంపెనీలు వాణిజ్య సిలిండర్లను పంపిస్తున్నాయని, ఇది తమకు సమస్యలు తెచ్చిపెడుతున్నాయని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అమలు చేస్తున్న ఈ విధానాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండు చేశారు.