Share News

Lok Sabha will hold a special discussion: వందేమాతరంపై నేడు లోక్‌సభలో చర్చ

ABN , Publish Date - Dec 08 , 2025 | 03:45 AM

వందేమాతర గీతంపై సోమవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరుపనున్నారు. వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకను ఏడాది పాటు నిర్వహించుకోవడంలో భాగంగా.....

Lok Sabha will hold a special discussion: వందేమాతరంపై నేడు లోక్‌సభలో చర్చ

  • వెలుగులోకి రాని కీలక విషయాలు వెల్లడించేందుకే !

  • 150 ఏళ్ల వేడుకల్లో భాగంగానే.. రేపు రాజ్యసభలోనూ

  • రేపటి నుంచి సర్‌ సహా ఎన్నికల సంస్కరణలపై చర్చ

న్యూఢిల్లీ, డిసెంబరు 7: వందేమాతర గీతంపై సోమవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరుపనున్నారు. వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకను ఏడాది పాటు నిర్వహించుకోవడంలో భాగంగా ఈ చర్చ చేపట్టనున్నారు. ఈ జాతీయ గేయం గురించి ఇప్పటివరకు వెలుగులోకి రాని పలు కీలక విషయాలను ఈ సందర్భంగా వెల్లడించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో వందేమాతరంపై చర్చను ప్రారంభిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. అనంతరం రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రసంగిస్తారు. ఎన్డీయే పక్షాలకు లోక్‌సభలో 3 గంటలు కేటాయించగా, కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ ఉపనేత గౌరవ్‌ గగోయ్‌, ప్రియాంకా గాంధీ వాద్రా సహా 8 మంది నేతలు మాట్లాడనున్నారు. అలాగే, మంగళవారం రాజ్యసభలో హోంమంత్రి అమిత్‌షా ఈ అంశంపై చర్చను ప్రారంభించే అవకాశం ఉంది. అనంతరం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తదితరులు ప్రసంగిస్తారు. బంకించంద్ర ఛటర్జీ రాసిన ఈ గీతాన్ని 1875 నవంబరు 7న తొలిసారిగా లిటరరీ జర్నల్‌ బంగదర్శన్‌లో ప్రచురించారు. అనంతరం 1882లో ప్రచురితమైన తన నవల ఆనందమఠ్‌లో బంకించంద్ర ఛటర్జీ ఈ గీతాన్ని భాగం చేశారు. వందేమాతర గీతం 150 సంవత్సరాల ఉత్సవాన్ని ఏడాదిపాటు నిర్వహించుకునే కార్యక్రమాన్ని ప్రధానిమోదీ గతనెల 7న ఢిల్లీలో ప్రారంభించారు. ఏడాదిపాటు విద్యార్థులు, యువతలో జాతీయ గీతంపై అవగాహనను పెంపొందించనున్నారు. కాగా, 1937లో ఈ గీతం నుంచి కీలక చరణాలను కాంగ్రెస్‌ తొలగించిందని, తద్వారా దేశ విభజనకు బీజాలు నాటిందని మోదీ ఆరోపించారు. మరోవైపు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) సహా ఎన్నికల సంస్కరణలపై మంగళవారం నుంచి పార్లమెంటులో చర్చించనున్నారు. లోక్‌సభలో మంగళ, బుధవారాలు, రాజ్యసభలో బుధ, గురువారాలు ఎన్నికల సంస్కరణలపై చర్చిస్తారు. కాంగ్రెస్‌ నుంచి లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌ తదితరులు, రాజ్యసభలో మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడనున్నారు.

Updated Date - Dec 08 , 2025 | 06:10 AM