SIT Identifies: ఒక్కో ఓటు తొలగింపునకు రూ.80
ABN , Publish Date - Oct 24 , 2025 | 06:25 AM
కర్ణాటకలోని కలబురగి జిల్లా ఆళంద శాసనసభ నియోజకవర్గం ఓటర్ల జాబితా అవకతవకల కేసులో సిట్ అధికారులు కీలక విషయాలు గుర్తించారు.
కర్ణాటకలోని ఆళంద నియోజకవర్గ ఓటర్ల లిస్టు అక్రమాలపై సిట్ గుర్తింపు
బెంగళూరు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని కలబురగి జిల్లా ఆళంద శాసనసభ నియోజకవర్గం ఓటర్ల జాబితా అవకతవకల కేసులో సిట్ అధికారులు కీలక విషయాలు గుర్తించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6,018 మంది పేర్లను ఓటర్ల లిస్టు నుంచి తొలగించేందుకు డబ్బులు చెల్లించినట్లు గుర్తించారు. ఒక్కో ఓటు తొలగింపునకు రూ.80 చొప్పున ఓ డేటా సెంటర్ నిర్వాహకుడికి చెల్లించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఓట్లను తొలగింపునకు సంబంధించి 2022 డిసెంబరు, 2023 ఫిబ్రవరి మధ్య 6,018 దరఖాస్తులు చేశారని, ఇందుకుగానూ రూ.4.80 లక్షల చెల్లించారని గుర్తించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆళంద నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ పాటిల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత నెలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దయెత్తున ఓట్ల దొంగతనం ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. ఓటర్ల తొలగింపును పార్టీ గుర్తించకుంటే.. తాను ఆళంద సీటులో ఓడిపోయేవాడినని అన్నారు.