Justice B.R. Gavai: తదుపరి సీజేఐ జస్టిస్ గవాయ్
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:19 AM
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ ఎంపికయ్యారు. ఆయన పేరును చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా బుధవారం సిఫారసు చేశారు. జస్టిస్ గవాయ్ 13వ తేదీన ప్రమాణం చేసి, భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
కేంద్రానికి సుప్రీంకోర్టు సీజే సంజీవ్ ఖన్నా సిఫారసు
52వ భారత ప్రధాన న్యాయమూర్తిగా మే14న బాధ్యతల స్వీకరణ
జస్టిస్ బాలకృష్ణన్ తర్వాత ఆయనే రెండో దళిత సీజేఐ
మహారాష్ట్రలో జననం.. బొంబాయి హైకోర్టులో పలు హోదాల్లో విధులు
2019 నుంచి సుప్రీంకోర్టులో కీలక ధర్మాసనాల్లో ముఖ్యభూమిక
370 రద్దు, పెద్దనోట్ల రద్దు, ఎన్నికల బాండ్ల నిలిపివేత తీర్పుల్లో భాగం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16 : సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ ఎంపికయ్యారు. ఆయన పేరును కేంద్ర ప్రభుత్వానికి చీఫ్జస్టిస్ సంజీవ్ ఖన్నా బుధవారం సిఫారసు చేశారు. వచ్చే నెల 13వ తేదీన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి పదవీవిరమణ చేయనున్నారు. ఆ మరునాడు, 52వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు. అనంతరం ప్రస్తుత సీజే నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కానున్న రెండో దళిత న్యాయమూర్తి జస్టిస్ గవాయ్. చీఫ్జస్టి్సగా సంజీవ్ ఖన్నా అప్పటి సీజే చంద్రచూడ్ నుంచి గత నవంబరులో బాధ్యతలు తీసుకున్నారు. జస్టిస్ చంద్రచూడ్ బాటలోనే అయనా 65 ఏళ్ల వయసులో పదవీవిరమణ చేయనున్నారు. జస్టిస్ బీఆర్ గవాయ్ పూర్తిపేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబరు 24న ఆర్ఎస్ గవాయ్, కమల దంపతులకు ఆయన జన్మించారు. ఆర్ఎస్ గవాయ్ దళిత నాయకుడు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (గవాయ్ వర్గం) అధ్యక్షుడు. పార్లమెంటు సభ్యునిగాను, గవర్నర్గాను ఆయన సేవలు అందించారు. ఆయన సోదరుడు రాజేంద్ర గవాయ్ కూడా రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. జస్టిస్ గవాయ్ అమరావతి విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో ఉత్తీర్హులయ్యారు.
1985లో బార్కౌన్సిల్లో సభ్యులయ్యారు. బొంబాయి హైకోర్టులో 1992 నుంచి 1993 వరకు ఏజీపీగాను, ఏపీపీగాను పనిచేశారు. నాగ్పూర్ బెంచ్లో పీపీగా 2000 జనవరి 17న నియమితులయ్యారు. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 2005 నవంబరు 12న నియమితులయ్యారు. ఆయన 2019 మే 24 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.
‘ఎస్సీ వర్గీకరణ’ బెంచ్లో సభ్యులు
పలు చరిత్రాత్మక తీర్పులు వెలువరించిన సుప్రీంకోర్టు ఽరాజ్యాంగ ధర్మాసనాల్లో జస్టిస్ గవాయ్ సభ్యునిగా ఉన్నారు. ముఖ్యంగా, జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370ను రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించిన ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్లో ఆయన ఒకరు. ఎన్నికల బాండ్లను నిలిపివేస్తూ కీలక తీర్పును వెలువరించడంలో ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్లో జస్టిస్ గవాయ్ క్రియాశీలక భూమిక పోషించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని 4:1 మెజారిటీతో ఆమోదించిన ఐదుగురు సభ్యుల బెంచ్లో ఆయన ఒకరు. ఎస్సీ వర్గీకరణ జరిపే రాజ్యాంగ అధికారం రాష్ట్రాలకు ఉన్నదంటూ 6:1 మెజారిటీలో ఆమోదించిన ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో ఆయన సభ్యుడు.
ఇవి కూడా చదవండి...