Share News

S Jaishankar: ప్రపంచ ఉగ్రవాద కేంద్రం పాకిస్థాన్‌

ABN , Publish Date - Sep 28 , 2025 | 01:08 AM

ఉగ్రవాదాన్ని అధికార విధానంగా కలిగిన పొరుగుదేశం(పాకిస్థాన్‌) ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా నిలిచిందని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ చెప్పారు ...

S Jaishankar: ప్రపంచ ఉగ్రవాద కేంద్రం పాకిస్థాన్‌

న్యూయార్క్‌, సెప్టెంబరు 27: ఉగ్రవాదాన్ని అధికార విధానంగా కలిగిన పొరుగుదేశం(పాకిస్థాన్‌) ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా నిలిచిందని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ చెప్పారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించరాదని, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందకుండా చూడాలని ఆయన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రసంగిస్తూ చెప్పారు. ఉగ్రవాద మూలాలను ఉమ్మడిగా పెకిలించి వేయాలని ఆయన ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. పహల్గాంలో ఉగ్రవాదులు పాశవిక దాడి జరిపారని, ప్రతిగా భారత్‌ పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వసం చేసిందని చెప్పారు. గాజాలో శాంతి నెలకొనాలని, దీని కోసం భారత్‌ సహకరిస్తుందన్నారు. ఇదిలా ఉండగా, ఆపరేషన్‌ సిందూర్‌ వేళ కాల్పుల విమరణ విషయంలో మూడో దేశం ప్రమేయం లేదని.. మూడో వ్యక్తి ప్రమేయం అంతకన్నా లేదని భారత్‌ ఐరాస వేదికగా స్పష్టం చేసింది. ఈ మేరకు ఐరాసలో భారత శాశ్వత మిషన్‌ తొలి కార్యదర్శి పటేల్‌ గహ్లోత్‌ కీలక ప్రకటన చేశారు. ‘‘మే 9వ తేదీ వరకు భారత్‌పై కాల్పులకు పాల్పడుతూ.. పాక్‌ బెదిరింపు ధోరణిని ప్రదర్శించింది. కానీ, మే 10న భారత్‌తో పాక్‌ సైన్యం కాళ్లబేరానికి వచ్చింది. అయితే.. పాక్‌ ప్రధాని..తమ దేశంలో ధ్వంసమైన రన్‌వేలు తమ విజయమని భావిస్తే.. వారు ఆనందించవచ్చు’’ అని ఎద్దేవా చేశారు.

Updated Date - Sep 28 , 2025 | 01:08 AM