Jairam Ramesh Slams BJP: బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డంకులు
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:42 AM
తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి
బిహార్లో ఒకలా.. తెలంగాణలో మరొకలా ఎందుకు?: జైరాం రమేశ్
న్యూఢిల్లీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ జైరాం రమేశ్ ఆరోపించారు. ఎంతో చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేయాలని చూస్తుంటే, కేంద్రంలోని బీజేపీ మాత్రం ఉద్దేశపూర్వకంగానే కొర్రీలు పెడుతోందని ఆదివారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. బిహార్లో బీసీ బిల్లు గవర్నర్ సమ్మతితో అధికారికంగా చట్టంగా మారితే.. తెలంగాణలో గవర్నర్ ఆ బిల్లును రాష్ట్రపతి సమ్మతి కోసం పంపారన్నారు. 4 నెలలు గడిచినా రాష్ట్రపతి నుంచి ఎటువంటి సమాధానం లేదని చెప్పారు. బిహార్లో బిల్లు విషయంలో ఆలస్యం చేయించడం, అడ్డుకోవడం బీజేపీకి సాధ్యం కాలేదన్నారు. అయితే తెలంగాణ విషయంలో మాత్రం బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోందని.. ఆ పార్టీకి సామాజిక న్యాయంపై ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తేలిపోయిందని విమర్శించారు. బీజేపీ అడ్డుకోకపోతే 4 నెలలుగా రాష్ట్రపతి వద్దే ఆ బిల్లు పెండింగ్లో ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.