Indian military strategy: కొట్టాలి.. తిప్పికొట్టలేకుండా
ABN , Publish Date - Apr 30 , 2025 | 04:57 AM
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పరిమిత స్థాయిలో సైనిక చర్య చేపట్టే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. పాక్ ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో అది తీవ్ర ప్రతిదాడికి వెళ్ళే అవకాశం తక్కువగా ఉంది. ఈ పరిస్థితిలో భారత్కు ఉత్తమ వ్యూహం ఏమవుతుందో విశ్లేషించాలంటే చెప్పండి.
పాక్ ఉగ్రవాద శిబిరాలపై, వాటి ఆయువు పట్లపై దాడి
భారత సైన్యం ప్రతీకార వ్యూహమిదే!
పాక్ స్పందించలేని రీతిలో బుద్ధి చెప్పాలి
పూర్తిస్థాయి యుద్ధానికి చాన్స్ తక్కువే!
అడ్డుకునేందుకే పాక్ అణు బెదిరింపులు
పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా!? ప్రతిస్పందించాలో నిర్ణయించే పూర్తి స్వేచ్ఛను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్రివిధ దళాలకు ఇచ్చారు! ఉగ్రవాదం ఇక కోలుకోకుండా దెబ్బ కొట్టాలనీ నిర్దేశించారు! మరి.. ఈ పరిస్థితుల్లో భారత సైన్యం వ్యూహమేంటి!? అందుకు మన సన్నద్ధత ఎంత!? పూర్తిస్థాయి లేదా పరిమిత యుద్ధమే వస్తే పాకిస్థాన్ ప్రతిస్పందన ఎలా ఉండనుంది!? అటువంటి పరిస్థితుల్లో అమెరికా, రష్యా, చైనా ఏం చేసే అవకాశముంది!? అణు దాడి జరిగే అవకాశముందా!? జరిగితే.. ఏ స్థాయిలో ఉండనుంది!? తదితర అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’ రక్షణ ప్రతినిధి అందిస్తున్న సమగ్ర విశ్లేషణ..
పహల్గాం పాశవిక ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్పై ప్రతీకారానికి భారత్ సిద్ధమవుతోంది. ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం, పాక్ పౌరుల్ని పంపించేయడం వంటి పలు చర్యలు చేపట్టిన భారత్... సైనికపరంగా కూడా కొన్ని సన్నాహాలు ప్రారంభించింది. అయితే భారత్ ఎంతవరకూ ముందుకు వెళుతుంది? పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేస్తుందా? లేదంటే ఉగ్రవాదులకు దన్నుగా ఉన్న పాక్ సైనిక స్థావరాలపై కూడా అస్త్రాలు గురిపెడుతుందా? లేకపోతే పాక్పై పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్నాయి. పాక్పై త్వరలో భారత్ దాడి తథ్యమని సరిహద్దుకు ఇవతల, అవతల కూడా మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం భారత ప్రధాని మోదీ చేసిన

వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చేలా ఉన్నాయి. ‘‘ఉగ్రవాదులు భూమ్మీద ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాం. దాడికి పాల్పడ్డవారికి, దాడి వెనక సూత్రధారులకు అత్యంత కఠిన శిక్ష విధిస్తాం. వారిని కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తాం. వారి అంతు చూసేందుకు ఎంతవరకైనా వెళ్తాం. ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసే సమయం ఆసన్నమైంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కానీ భారత్ దాడి ఎప్పుడు? ఎక్కడ? ఎంతమేరకు? అనే ఉత్కంఠ ఇప్పుడు అందరిలో ఉంది. గతానుభవాలు, ఇరుదేశాల బలాబలాలు-పరిస్థితులు, అంతర్జాతీయ పరిస్థితులు, రక్షణ రంగ నిపుణుల అభిప్రాయాలను పరిశీలించినప్పుడు పాక్పై భారత్ దాడి పూర్తిస్థాయి యుద్ధంగా కాకుండా, పరిమితంగానే ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
భారత్ ఏం చేస్తుంది?
పాక్ ఉగ్రవాద దాడులకు భారత్ సైనిక చర్యల ద్వారా స్పందించడం ఇదే మొదటిసారి కాదు. 2001లో భారత పార్లమెంటుపై పాక్ ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు భారత్ ఆపరేషన్ పరాక్రమ్ పేరిట భారీ సైనిక మోహరింపు చేపట్టింది. అయిదు లక్షల మంది సైన్యాన్ని పాక్ సరిహద్దులో మోహరించి పాక్పై శతఘ్నులతో కాల్పులు జరిపింది. ఆ తర్వాత 2016లో యూరిలో భారత ఆర్మీ ఔట్పోస్టుపై ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత సైనిక కమాండోలు నియంత్రణ రేఖ దాటి ఆక్రమిత కశ్మీర్లోని పాక్ సైనిక శిబిరాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో చాలామంది పాక్ సైనికుల్ని చంపినట్టు భారత్ ప్రకటించగా... పాక్ మాత్రం ఇద్దరే చనిపోయారని, ఓ భారత సైనికుడిని బంధించామని తెలిపింది. మొత్తమ్మీద ఆనాటి దాడిలో ఎటువైపు ఎందరు చనిపోయారనేది ఇప్పటివరకూ స్పష్టంగా తెలియదు. 2019లో పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో 40 మంది భారత సైనికులు చనిపోవడంతో భారత వాయుసేన పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది. ఆ దాడిలో 350 మంది దాకా ఉగ్రవాదులు చనిపోయినట్టు భారత వాయుసేన వర్గాలను ఉటంకిస్తూ భారత మీడియా వెల్లడించగా, ఎవరూ చావలేదని పాక్ ప్రకటించింది. ఆ మర్నాడు పాక్ యుద్ధ విమానాలు భారత్లోకి ప్రవేశించి దాడి చేశాయి. భారత మిగ్-21 యుద్ధ విమాన పైలట్ అభినందన్ వర్ధమాన్ పాక్ ఎఫ్-16 (అమెరికా తయారీ)ను కూల్చివేసినట్లు మన వాయుసేన ప్రకటించింది. అయితే ఆ ఎఫ్-16 నుంచి అప్పటికే చేసిన క్షిపణి ప్రయోగం వల్ల మన మిగ్-21 కూలిపోయి వర్ధమాన్ పాక్ సైన్యానికి పట్టుబడ్డాడు. ఆ దాడిలో తాము ఎఫ్-16ను వాడలేదని, చైనా తయారీ జేఎఫ్ 17 విమానాల్ని మాత్రమే ఉపయోగించామని పాక్ చెప్పుకుంది. ఎఫ్-16 వాడారనేందుకు సాక్ష్యంగా భారత్ దాని నుంచి ప్రయోగించిన ఎయిమ్-120 డి క్షిపణి శకలాలను మీడియాకు చూపించింది. మొత్తమ్మీద భారత్ దాడిలో తమకు ఏమీ నష్టం జరగలేదని చెప్పేందుకు పాక్ ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో తాజా ఉగ్రవాద దాడి అనంతరం భారత్ ఏమి చేయబోతోంది? దానికి పాక్ ఎలా స్పందిస్తుంది? అనేది ఉత్కంఠ రేపుతోంది.
కనీసం ఇది చేయాల్సిందే!
‘‘ఉగ్రవాద దాడులకు ప్రతీకారంగా సరిహద్దు దాటి పాక్పై దాడి చేయడం అనేది 2016, ప్రత్యేకించి 2019 తర్వాత ఒక కనీస చర్యగా మారింది. అందువల్ల పాక్ ఆగడాల్ని సహించబోమని సరిహద్దుకు ఇవతల, అవతల చాటి చెప్పే ఉద్దేశంతో భారత్ కొంత గట్టిగానే స్పందించే అవకాశం ఉంది. గతంలో తీసుకున్న చర్యల కంటే తక్కువ స్థాయి చర్య తీసుకోవడం అసాధ్యం’’ అని ప్రముఖ యుద్ధ చరిత్రకారుడు శ్రీనాథ్ రాఘవన్ బీబీసీకి చెప్పారు. ‘‘పాక్పై కఠిన చర్య తీసుకోవాలని భారత ప్రజల నుంచి ప్రభుత్వంపై చాలా ఒత్తిడి ఉంది. పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ గట్టిగా దాడి చేస్తే అది పాక్కు గట్టి హెచ్చరిక పంపినట్టు అవుతుంది. అయితే పాక్ ప్రతీకార చర్యలకు దిగితే ఇదంతా తీవ్ర సంక్షోభానికి, యుద్ధానికీ దారితీసే ప్రమాదమూ ఉంది’’ అని విదేశాంగ విధాన విశ్లేషకుడు మైఖేల్ కుగెల్మ్యాన్ అభిప్రాయపడ్డారు. భారత్ ఒకవేళ దాడి చేసి పాక్ మళ్లీ ప్రతీకార దాడి చేయకపోతే పాకిస్థాన్ ప్రభుత్వంపై పాక్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల పాక్ స్పందన ఎలా ఉంటుందనే విషయంలో భారత్ ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటు భారత్, అటు పాక్ రెండూ అణ్వస్త్ర దేశాలు కావడం వల్ల దాడి ఏ స్థాయిలో ఉండాలనేది నిర్ణయించుకోవడం అంత సులభమైన విషయం కాదు. గతంలో కొన్నిసార్లు పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ రహస్య దాడులు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈసారి కూడా అలా చేయవచ్చుగానీ రహస్య దాడుల వల్ల జనాగ్రహం చల్లారదు. అందువల్ల భారత్ ఏం చేసినా బాహాటంగానే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే భారత దాడి తర్వాత పాక్ గట్టిగా స్పందించలేని విధంగా మన వ్యూహాన్ని రూపొందించుకోవడం చాలా ముఖ్యమని రక్షణ నిపుణులు చెబుతున్నారు. భారత్ పరిమిత స్థాయిలో సైనిక చర్య తీసుకుంటే దానిపై పాకిస్థాన్ ఆగ్రహావేశాలతో స్పందించి పూర్తిస్థాయి యుద్ధానికి దిగే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. కారణం... పాక్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అప్పులు భారీగా పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం దాదాపు 40 శాతానికి చేరింది. ప్రభుత్వ ఆదాయంలో 45 శాతంపైగా వడ్డీలకే పోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి యుద్ధం చేసే దుస్సాహసానికి పాక్ పూనుకోకపోవచ్చు. అందువల్ల తమ ప్రజల్ని సంతృప్తిపరచడానికి భారత్ దాడిని తక్కువ చేసి చూపడంతోపాటు, తాము ఏదో నామమాత్రపు ప్రతిదాడి చేసినట్టుగా పాక్ నటించే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడి... లేదంటే ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాక్ సైనిక శిబిరాలపై, ఐఎస్ఐ స్థావరాలపై దాడి అనే రెండు ఆప్షన్లలో ఒకదానిని భారత్ ఎంచుకోవచ్చునని ఎక్కువమంది రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..