Pemmasani Chandrasekhar Inaugurated: దేశంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ గ్రామీణ గృహం
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:10 AM
దేశంలోనే మొట్టమొదటి త్రీడీ కాంక్రీట్ ప్రింటెడ్ గ్రామీణ గృహాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం ప్రారంభించారు....
రూర్కీలో ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమ్మసాని
న్యూఢిల్లీ, అక్టోబరు 1: దేశంలోనే మొట్టమొదటి త్రీడీ కాంక్రీట్ ప్రింటెడ్ గ్రామీణ గృహాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం ప్రారంభించారు. ఉత్తరాఖండ్లోని రూర్కీలో ఉన్న సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎ్సఐఆర్-సీబీఆర్ఐ)లో ఆయన దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో అర్హులైన వారందరికీ ఇళ్లు నిర్మించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం దిశగా ఇదొక కీలక ముందడుగని అన్నారు. టెక్నాలజీ సాయంతో గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ త్రీడీ ప్రింటెడ్ ఇళ్లు.. పర్యావరణ అనుకూలంగా ఉంటాయని చెప్పారు. ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన (పీఎంఏవై-జీ) పథకం కింద దేశవ్యాప్తంగా 3.85 కోట్ల ఇళ్లు మంజూరు చేశామని, వాటిలో 2.87 కోట్ల ఇళ్లు పూర్తయ్యాయని వెల్లడించారు. ఈ ప్రయాణంలో సీబీఆర్ఐ సహకారం మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా ‘ఉత్తరాఖండ్లో గ్రామీణ గృహనిర్మాణం’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని కూడా మంత్రి విడుదల చేశారు. ‘అభివృద్ధి అంటే కేవలం ఇళ్లు నిర్మించడమే కాదు. అవి గౌరవం, స్వావలంబనతో వారి జీవితాల్లో వెలుగులు నింపేలా ఉండాలి’ అని పెమ్మసాని పేర్కొన్నారు.