Border Air Defence: సరిహద్దు రక్షణకు ఏకే 630 గన్స్
ABN , Publish Date - Oct 06 , 2025 | 02:27 AM
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ తన గగనతల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా భారత ఆర్మీ..
ఆరు శతఘ్నుల కొనుగోలుకు ఆర్మీ టెండర్
న్యూఢిల్లీ, అక్టోబరు 5: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ తన గగనతల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా భారత ఆర్మీ.. ప్రభుత్వ యాజమాన్యంలోని అడ్వాన్స్డ్ వెపన్ అండ్ ఎక్వి్పమెంట్ ఇండియా లిమిటెడ్ (ఏడబ్ల్యూఈఐఎల్) నుంచి ఆరు ఏకే-630 వైమానిక రక్షణ శతఘ్నుల కొనుగోలుకు టెండర్ జారీచేసింది. మిషన్ సుదర్శన్ చక్ర ప్రాజెక్టు కింద డ్రోన్లు, రాకెట్ల వంటి వైమానిక ముప్పుల నుంచి పాకిస్థాన్కు సరిహద్దుకు దగ్గరగా ఉన్న సున్నితమైన ప్రాంతాల్లో వీటిని మోహరించనున్నట్టు రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఈ కొత్త ఆయుధ వ్యవస్థ భారత గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుందని, ముఖ్యంగా భూమిపై నుంచి 10వేల మీటర్ల ఎత్తు నుంచి వచ్చే ముప్పులపై ఇది దృష్టిపెడుతుందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో జమ్ము కశ్మీర్, పంజాబ్ల్లోని పౌర నివాసాలు, మతపరమైన భవనాలపై పాక్ సైన్యం ప్రత్యక్ష దాడులకు తెగబడింది. దీంతో భవిష్యత్తులో ఇలాంటి ముప్పుని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ ఏకే-630 వైమానిక రక్షణ శతఘ్నుల కొనుగోలుకు సిద్ధమైంది.ఏకే-630 అనేది ఆరు బ్యారెళ్లతో కూడిన 30 ఎంఎం ఫిరంగి. 4 నుంచి 6 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అలవోకగా ఛేదించగలదు.