Indus Waters Treaty: సింధు స్ఫూర్తికి పాక్ తూట్లు
ABN , Publish Date - May 25 , 2025 | 04:20 AM
సింధు జలాల ఒప్పందంపై పాక్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఐరాసలో భారత్ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదంతో సహా పాక్ ఒప్పంద స్ఫూర్తిని ఉల్లంఘించిందని రాయబారి హరీశ్ పర్వతనేని వ్యాఖ్యానించారు.
ఐక్యరాజసమితిలో గర్జించిన భారత్
యునైటెడ్నేషన్స్, మే 24: దాయాది దేశం పాకిస్థాన్ కుటిలత్వంపై ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో భారత్ గర్జించింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంపై పాకిస్థాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టింది. ‘‘65 ఏళ్ల కిందట ఒక మంచి సదుద్దేశంతో, చిత్తశుద్ధితో సింధు జలాల ఒప్పందం చేసుకున్నాం.’’ అని వెల్లడించిన భారత్.. మూడు యుద్ధాలు చేయడం ద్వారా, వేలాది సార్లు ఉగ్రమూకలను భారత్పై ఉసిగొల్పడం ద్వారా సింధు జలాల స్ఫూర్తిని పాక్ ఉల్లంఘించిందని స్పష్టం చేసింది. ‘‘సింధు జలాలపై పాక్ ప్రతినిధులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎగువ నదీజలాల దేశంగా ఉన్న భారత్.. సింధు విషయంలో ఎప్పుడూ బాధ్యతగానే వ్యవహరించింది. అసలు ఈ ఒప్పందంలోని ప్రవేశిక... ‘సద్భావన, స్నేహస్ఫూర్తి’ని చాటుతుంది. కానీ, ఈ స్ఫూర్తిని పాక్ మంటగలిపింది.’’ అని ఐరాసలో శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీశ్ నిప్పులు చెరిగారు. సింధు జలాల ఒప్పందాన్ని దాయాది దేశమే అన్ని రూపాల్లోనూ ఉల్లంఘిస్తోందని ఆయన తేల్చి చెప్పారు. ‘‘ఉగ్రదాడుల కారణంగా గత నాలుగు దశాబ్దాల్లో 20 వేల మందికిపైగా భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల పహల్గాంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని అంత్యంత దారుణానికి ఒడిగట్టారు. అయినా.. భారత్ అసాధారణ సహనాన్ని, ఉదారతను చాటుకుంది. పాక్ ప్రాయోజిత ఉగ్రవాదం.. భారత్లోని పౌరుల జీవితాలను, మత సామరస్యాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నిస్తోంది.’’ అని హరీశ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి
Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO
Husband And Wife: సెల్ఫోన్లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..