FATF Grey List: ఆర్థిక దిగ్బంధనంలో పాకిస్థాన్
ABN , Publish Date - May 03 , 2025 | 04:12 AM
పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్థాన్పై ఆర్థికంగా ఒత్తిడి తెచ్చేందుకు భారత్ కఠిన చర్యలు చేపడుతోంది. ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులో పాక్ను మళ్లీ చేర్చించేందుకు అంతర్జాతీయ స్థాయిలో సంప్రదింపులు జరుపుతోంది.
కేంద్రం వ్యూహరచన.. ఎఫ్ఏటీఎఫ్
గ్రే లిస్టులో పాక్ను తిరిగి చేర్చేలా యత్నాలు
ఫలిస్తే.. ఆ దేశానికి విదేశీ పెట్టుబడులు కరువు
ఐఎంఎఫ్ ఆర్థిక ప్యాకేజీనీ అడ్డుకునే చర్యలు
న్యూఢిల్లీ, మే 2: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ లక్ష్యంగా పలు కఠిన చర్యలు తీసుకుంటున్న కేంద్రప్రభుత్వం.. ఆర్థిక పరమైన దిగ్బంధనం దిశగానూ అడుగులు వేస్తోంది. ముఖ్యంగా, సీమాంతర ఉగ్రవాదానికి ఆ దేశం ఎంతమాత్రమూ మద్దతివ్వకుండా ఉండేలా.. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ద్వారా ఆంక్షలు విధింపజేయాలని యోచిస్తోంది. దీంట్లోభాగంగా.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎ్ఫ)లోని ఇతర సభ్యదేశాలతో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. పాక్ను తిరిగి ఎఫ్ఏటీఎఫ్ ‘గ్రే లిస్టు’లో పెట్టేలా భారత్ పావులు కదుపుతోంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే.. పాకిస్థాన్ ఆర్థిక కార్యకలాపాలపై నిఘా పెరుగుతుంది. ఫలితంగా ఆ దేశానికి విదేశీ పెట్టుబడులు తగ్గుతాయి. ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ ఏటా మూడుసార్లు (ఫిబ్రవరి, జూన్, అక్టోబరులో) సమావేశమవుతుంది. వచ్చే జూన్లో జరిగే ప్లీనరీలో పాక్ను గ్రే లిస్టులో పెట్టే ప్రతిపాదనను భారత్.. సభ్యదేశాల ముందు ఉంచనుంది. మరోవైపు, పాకిస్థాన్కు ఐఎంఎఫ్ ఇవ్వనున్న రూ.59,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీపైనా గట్టిగా స్పందించాలని కేంద్రం భావిస్తోంది. ఈ భారీ ప్యాకేజీ ఉగ్రసంస్థల కార్యకలాపాలకు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని, కాబట్టి, ఆ సాయాన్ని నిలిపివేయాలని ఐఎంఎ్ఫను కోరే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..