విదేశీ లాయర్లపై కఠిన ఆంక్షలు
ABN , Publish Date - May 16 , 2025 | 04:52 AM
భారత్లోని కక్షిదారుల తరఫున వాదనలు వినిపించేందుకు వచ్చే విదేశీ న్యాయవాదుల విషయంలో కఠిన నిబంధనలు జారీ అయ్యాయి.
వస్తున్నట్టు ముందుగా బార్ కౌన్సిల్కు చెప్పాలి
కక్షిదారు వివరాలివ్వాలి.. కొత్త నిబంధనలు జారీ
న్యూఢిల్లీ, మే 15: భారత్లోని కక్షిదారుల తరఫున వాదనలు వినిపించేందుకు వచ్చే విదేశీ న్యాయవాదుల విషయంలో కఠిన నిబంధనలు జారీ అయ్యాయి. గతంలో విదేశీ లాయర్లు వచ్చి వాదనలు వినిపించేందుకు ‘ఫ్లై ఇన్.. ఫ్లై అవుట్’ విధానం అమలయ్యేది. వారు వచ్చి కేవలం వాదనలు వినిపించి వెళ్లిపోయేవారు. 2023లో తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం విదేశీ, అంతర్జాతీయ చట్టాలకు సంబంధించిన కేసులు, కార్పొరేట్ చట్టం కేసులు వాదించేందుకు కార్యాలయాలు తెరవవచ్చు. ప్రస్తుతం కార్యాలయాలు తెరవకుండా కేవలం వాదనలు వినిపించేందుకు వచ్చే విదేశీ లాయర్లకు కొన్ని పరిమితులు పెడుతూ తాజాగా నిబంధనలు విడుదలయ్యాయి. దీని ప్రకారం వాదనలు నిమిత్తం భారత్ వచ్చే లాయర్లు ఆ విషయాన్ని ముందుగా బార్ కౌన్సిల్కు తెలియజేయాలి.
క్లయింట్ సమాచారం, కాంటాక్టు వివరాలు ఇవ్వాలి. ఈ సమాచారంతో డిక్లరేషన్ అందజేయాలి. 12 నెలల్లో 60 రోజులకు మించి భారత్లో ఉండడానికి వీల్లేదు. అందువల్ల చేసే పని, ఎంత కాలం ఉండదలచుకున్నారనే విషయాలను ముందుగానే వెల్లడించాలి. దీనిని కొందరు న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు. సరళీకరణ పేరుతో మరిన్ని ఆంక్షలు పెట్టారని వ్యాఖ్యానిస్తున్నారు. విదేశీ స్టాక్ లిస్టింగ్ కేసులు ఎక్కువ సమ యం తీసుకుంటాయని, అలాంటప్పుడు 60 రోజుల వ్యవధి సరిపోదని అంటున్నారు. తప్పనిసరిగా కార్యాలయాలు ప్రారంభించాలనడం, బార్ కౌన్సిల్కు సమాచారం ఇవ్వాలనడం సరికాదని చెబుతున్నారు. కార్యాలయాలు ఏర్పాటు చేయకుండానే వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వడం వల్ల ఎక్కువ మంది విదేశీ లాయర్లు వచ్చే అవకాశం ఉందని ఇంకొందరు భావిస్తున్నారు. స్థానికులకు నష్టం జరుగుతుందన్న కారణంతో విదేశీ లాయర్ల రాకను మొదటి నుంచీ బార్ కౌన్సిల్ వ్యతిరేకిస్తోంది.