Piyush Goyal: బీవైడీకి తలుపులు తెరవం!
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:27 AM
బీవైడీ కంపెనీ భారత్లో ఈవీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతానికి అనుమతి లేదని పీయూష్ గోయల్ తెలిపారు. దేశ భద్రతా, వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా బీవైడీ ప్రతిపాదనను గతంలో కేంద్రం తిరస్కరించింది.

భారత చట్టాలను పాటిస్తామని నమ్మకం కలిగిస్తే ఆలోచిస్తాం
దేశ భద్రత దృష్ట్యా నిర్ణయించాల్సిన అంశమిది: పీయూష్ గోయల్
భారత్లో ఈవీల పరిశ్రమ ఏర్పాటు ఆలోచన లేదు: బీవైడీ
ముంబై, ఏప్రిల్ 9: చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీదారు బీవైడీ కంపెనీకి.. ప్రస్తుతానికైతే భారత్లో తలుపులు తెరవటం లేదని కేంద్ర వాణిజ్య పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. భారత చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటామని ఆ కంపెనీ నమ్మకం కలిగిస్తే ప్రభుత్వం అప్పుడు ఆలోచిస్తుందన్నారు. భారత్లో పెట్టుబడులకు ఎవర్ని అనుమతించాలన్నది దేశ వ్యూహాత్మక, భద్రతాపరమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయించాల్సిన అంశమని చెప్పారు. ముంబైలో జరిగిన ‘ఇండియా గ్లోబల్ ఫోరం’ సదస్సులో మాట్లాడుతూ పీయూష్ గోయల్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో బీవైడీ వెయ్యి కోట్ల డాలర్ల (రూ.86,707 కోట్లు) పెట్టుబడితో ఈవీల తయారీ పరిశ్రమను నెలకొల్పనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, తమకు అటువంటి ఆలోచనేమీ లేదని బీవైడీ ఓ ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం భారత్లో బీవైడీ కంపెనీ కార్యాలయాలున్నాయి గానీ.. ఫ్యాక్టరీ లేదు. బీవైడీ చైనా నుంచి ఈవీలను దిగుమతి చేసుకొని భారత్లో విక్రయిస్తోంది. కాగా, మేఘా ఇంజినీరింగ్ కంపెనీతో కలిసి 100 కోట్ల డాలర్లతో(రూ.8,670కోట్లు) ఈవీల పరిశ్రమను ఏర్పాటు చేస్తామన్న బీవైడీ ప్రతిపాదనను కేంద్రం 2023లో తిరస్కరించినట్లు సమాచారం.