Prime Minister Modi: జీఎస్టీ తగ్గింపుతో పెరిగిన పొదుపు
ABN , Publish Date - Sep 30 , 2025 | 03:41 AM
వస్తు-సేవల పన్ను జీఎస్టీ విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను ప్రధాని మోదీ సమర్థించుకున్నారు. ప్రతిపక్షాల విమర్శలను...
ఒక్కో కుటుంబానికి ఏటా రూ.20వేలు ఆదా: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను ప్రధాని మోదీ సమర్థించుకున్నారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ ‘ప్రగల్భాలు పలికేవారి’ (బయాన్ బహదూర్) మాటలకేమిగానీ జీఎస్టీ తగ్గింపు కారణంగా ప్రజలకు సొమ్ము ఆదా అయిందని చెప్పారు. యూపీఏ పాలనతో పోల్చినప్పుడు సంవత్సరానికి రూ.లక్ష వ్యయం చేసే కుటుంబం ప్రస్తుతం రూ.20వేలను మిగుల్చుకోగలుగుతోందని చెప్పారు. సోమవారం ప్రధాని మోదీ ఇక్కడ బీజేపీ ఢిల్లీ శాఖ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ జీఎస్టీ తగ్గింపుతో పాటు ఆదాయపు పన్నులో మినహాయింపులు ఇచ్చిన కారణంగా ప్రతియేటా ఒక్కో కుటుంబానికి రూ.2.5 లక్షల మేర ఆదా అవుతోందని తెలిపారు. ఈ సంస్కరణలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ముఖ్యంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రచారం చేయాలని కార్యకర్తలను కోరారు.