GST Cut Brings Big Savings: ఏసీలు, ఫ్రిజ్లు మరింత కూల్..
ABN , Publish Date - Sep 05 , 2025 | 04:31 AM
పండుగ సమయంలో కొత్తగా గృహోపకరణాలు కొనుగోలు చేయాలనుకునేవారికి జీఎస్టీ పన్నుల మార్పు బంపర్ ఆఫర్గా మారింది..
1.5 టన్ ఏసీపై 4 వేల వరకు తగ్గింపు
43 అంగుళాల టీవీలపై 2,500 వరకు..
వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలు
1,500 నుంచి 5000 వరకు తగ్గే చాన్స్
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పండుగ సమయంలో కొత్తగా గృహోపకరణాలు కొనుగోలు చేయాలనుకునేవారికి జీఎస్టీ పన్నుల మార్పు బంపర్ ఆఫర్గా మారింది. టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్లపై పన్ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతుండటం లాభం చేకూర్చనుంది. ఉదాహరణకు 43 అంగుళాల ఎల్ఈడీ టీవీలపై సుమారు రూ.2,500 నుంచి రూ.4 వరకు, అంతకన్నా పెద్ద టీవీలపై రూ.8 వేల వరకు ప్రయోజనం కలగనుంది. 1.5 టన్నుల సామర్థ్యమున్న ఏసీల ధర సుమారు రూ.5 వేల వరకు తగ్గే వీలుంది. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలూ రూ.1,500 నుంచి రూ.7 వేల వరకు దిగిరానున్నాయి. ఐదు దశాబ్దాలకు పైనే తాము ఈ వ్యాపారంలో ఉన్నామని, ఎప్పుడూ పన్ను తగ్గింపు రూపంలో ఇంత ప్రయోజనం కలగలేదని హైదరాబాద్లో ప్రముఖ ఏసీ కంపెనీలకు డీలర్గా వ్యవహరించే సాయిరాం ఎయిర్ కండీషనింగ్ కంపెనీ అధినేత ప్రతీక్ పేర్కొన్నారు.

ఇప్పటికే కొనుగోళ్లు బంద్..
జీఎస్టీ తగ్గింపు ఉంటుందన్న వార్తల నేపథ్యంలో కొన్నిరోజులుగా ఎలకా్ట్రనిక్ వస్తువుల కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయని డీలర్లు, షోరూమ్ల మేనేజర్లు చెబుతున్నారు. ముఖ్యంగా జీఎస్టీ తగ్గింపు ప్రకటన తర్వాత ఒక్కసారిగా నిలిచిపోయాయని అంటున్నారు. ఇటీవల ఆర్డర్లు ఇచ్చినవారు కూడా డెలివరీ తీసుకోకుండా రద్దు చేసుకుంటున్నారని చెబుతున్నారు. పండుగ విక్రయాల కోసం తాము పెద్ద ఎత్తున స్టాక్ సిద్ధం చేసుకున్నామని.. మరి వాటిపై చెల్లించిన పన్ను విషయంలో ప్రభుత్వం నుంచి ఊరట కలిగించే నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామని అంటున్నారు. ‘‘సెప్టెంబరు 22 తర్వాత కొనుగోలు చేసే ప్రతి ఎలకా్ట్రనిక్ వస్తువుకు తగ్గిన శ్లాబుల మేరకు బిల్ చేయాల్సి ఉంటుంది. వినియోగదారులకు ప్రయోజనం అందుతుంది. వ్యాపారుల విషయంలో ప్రభుత్వం, కంపెనీలు తగిన నిర్ణయం తీసుకుంటాయని ఆశిస్తున్నాం’’ అని ప్రముఖ బ్రాండ్ షోరూం మేనేజర్ పేర్కొన్నారు.