Forensic Student: సహజీవనంలో ఉన్న యువకుడిని మాజీ ప్రియుడితో కలిసి చంపిన యువతి
ABN , Publish Date - Oct 28 , 2025 | 03:42 AM
యూపీలోని మొరాదాబాద్కు చెందిన ఫోరెన్సిక్ విద్యార్థిని, తన మాజీ ప్రియుడితో కలిసి ప్రస్తుత సహజీవన భాగస్వామిని అతి కిరాతకంగా హత్య...
నిందితురాలు అమృతా చౌహాన్ ఫోరెన్సిక్ విద్యార్థిని
ఆ జ్ఞానంతోనే హత్యకు ప్లాన్..అగ్నిప్రమాదంగా చిత్రీకరణ
న్యూఢిల్లీ, అక్టోబరు 27: యూపీలోని మొరాదాబాద్కు చెందిన ఫోరెన్సిక్ విద్యార్థిని, తన మాజీ ప్రియుడితో కలిసి ప్రస్తుత సహజీవన భాగస్వామిని అతి కిరాతకంగా హత్య చేసి, ఆపై అగ్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. ఢిల్లీలోని గాంధీ విహార్లో ఈ నెల మొదటివారంలో ఓ అపార్ట్మెంట్లో కాలిపోయిన స్థితిలో లభ్యమైన యూపీఎస్సీ ఆశావహుడైన రాంకేష్ మీనా హత్యకేసును పోలీసులు సోమవారం చేధించారు. ఫోరెన్సిక్ విద్యార్థిని అమృతా చౌహాన్(21), రాంకేష్ మీనా(32)తో గత మే నెల నుంచి సహజీవనంలో ఉంది. ఈ క్రమంలో తన ప్రైవేటు వీడియోలను మీనా రహస్యంగా రికార్ చేశాడని అమృత గుర్తించింది. వాటిని డిలీట్ చేయమని పదే పదే విజ్ఞప్తి చేసినా మీనా నిరాకరించడంతో.. అమృత ఎలాగైనా అతనికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. తన మాజీ ప్రియుడు సుమిత్, మరో స్నేహితుడి సాయంతో హత్యకు వ్యూహ రచన చేసింది. అమృత ఫోరెన్సిక్ సైన్స్ నేపథ్యం, క్రైం వెబ్ సిరీ్సల పట్ల ఉన్న ఆసక్తితో ఏ చిన్న ఆధారం దొరకకుండా హత్యకు ప్లాన్ చేసింది. సుమిత్ వంట గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూటర్ కావడంతో అతని అనుభవాన్ని ఉపయోగించుకోవాలని భావించింది. ఈ కుట్రలో వారిద్దరి స్నేహితుడు సందీప్ కుమార్ కూడా చేరాడు. ముగ్గురు కలిసి అక్టోబర్ 5న మొరాదాబాద్ నుంచి ఢిల్లీలోని మీనా అపార్ట్మెంట్కు చేరుకున్నారు. మొదట మీనాను తీవ్రంగా కొట్టి, ఆపై గొంతు నులిమి చంపారు. మృతదేహంపై మంటలు వేగంగా వ్యాపించడానికి బాధితుని శరీరంపై నెయ్యి, నూనె, ఆల్కహాల్ పోశారు. సుమిత్ గ్యాస్ సిలిండర్కు చిన్న రంధ్రం చేసి, వాల్వ్ ఆన్ చేసి గది అంతా గ్యాస్తో నిండిపోయేలా చేశాడు. తర్వాత లైటర్తో నిప్పంటించి.. అనుమానం రాకుండా గదిని లోపలి నుంచి లాక్ చేశారు. ఆధారాలు నాశనం చేయడానికి మీనా హార్డ్డిస్క్, ల్యాప్టా్పలు, ఇతర వస్తువులు తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. వారు భవనం నుంచి బయలుదేరిన సుమారు గంట తర్వాత పేలుడు సంభవించింది. పోలీసులు మొదట షార్ట్ సర్య్కూట్ లేదా ఏసీ పేలుడుగా భావించినప్పటికీ, ఫోరెన్సిక్ ఆధారాలు, ఘటన జరిగిన సమయంలో అమృత మొబైల్ ఫోను లొకేషన్తో ఆమె ఆ ప్రాంతంలోనే ఉన్నట్లు గుర్తించి.. హత్యేనని నిర్ధారించుకున్నారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.