Fake Diplomatic Mission: వెస్ట్ ఆర్కిటికా దేశమట.. ఆ దేశానికి రాయబారి అట..
ABN , Publish Date - Jul 24 , 2025 | 03:38 AM
వెస్ట్ ఆర్కిటికా, సెబోర్గా, లోడోనియా, పౌల్వియా అనే కాల్పనిక దేశాల పేరుతో భారత్లో అనధికారికంగా రాయబార కార్యాలయాన్ని నడుపుతూ.. యువతను ఉద్యోగాల పేరుతో మోసగిస్తున్న కేటుగాడి ఆటను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు కట్టించారు.
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో ఏకంగా నకిలీ ఎంబసీనే తెరిచిన ఘనుడు
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువతపై వల.. భారీ ఎత్తున వసూళ్లు
హవాలా మార్గాల్లో షెల్ కంపెనీలకు.. నిందితుడు హర్షవర్ధన్ జైన్ అరెస్ట్
లఖ్నవూ, జూలై 23: వెస్ట్ ఆర్కిటికా, సెబోర్గా, లోడోనియా, పౌల్వియా అనే కాల్పనిక దేశాల పేరుతో భారత్లో అనధికారికంగా రాయబార కార్యాలయాన్ని నడుపుతూ.. యువతను ఉద్యోగాల పేరుతో మోసగిస్తున్న కేటుగాడి ఆటను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు కట్టించారు. ఈ కేసులో గాజియాబాద్కు చెందిన హర్షవర్ధన్ జైన్ను అరెస్టుచేసి, అతని నుంచి నకిలీ డిప్లొమాటిక్ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు ఉన్న నాలుగు వాహనాలు, 12 నకిలీ రాయబార పాస్పోర్టులు, విదేశాంగ మంత్రిత్వ శాఖ ముద్రలతో ఉన్న నకిలీ పత్రాలు, రెండు నకిలీ పాన్కార్డులు, వివిధ కాల్పనిక దేశాలకు చెందిన 34 స్టాంపులు, రెండు నకిలీ ప్రెస్ కార్డులు, రూ.44.7 లక్షల నగదు, విదేశీ కరెన్సీ, అనేక షెల్ కంపెనీలకు సంబంధించిన పత్రాలు, 18 నకిలీ డిప్లొమాటిక్ వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లను సీజ్ చేశారు. నిందితుడిని తదుపరి దర్యాప్తు నిమిత్తం కవినగర్ పోలీసులకు అప్పగించారు. కవినగర్ పోలీసుల కథనం ప్రకారం.. గాజియాబాద్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న హర్షవర్ధన్ జైన్ అందులో ‘వెస్ట్ ఆర్కిటికా’ అనే కాల్పనిక దేశానికి సంబంధించిన రాయబార కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు. తనను తాను ఆ సూక్ష దేశానికి(మైక్రోనేషన్) రాయబారిగా పరిచయం చేసుకునేవాడు. సెబోర్గా, లోడోనియా, పౌల్వియా అనే మైక్రోనేషన్స్తో కూడా తనకు సంబంధాలున్నట్లు చెప్పుకొంటూ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువతను మోసగించేవాడు.
యువత నుంచి కొల్లగొట్టిన సొమ్మును హవాలా మార్గాల్లో అనేక షెల్ కంపెనీలకు తరలించేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తాను విదేశీ రాయబారినని నమ్మించేందుకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఫొటోలు దిగినట్లుగా డిజిటల్ చిత్రాలను సృష్టించి.. ప్రజలకు చూపేవాడు. తన వాహనాలకు ‘డిప్లొమాటిక్ నంబర్ ప్లేట్లు’ బిగించి, వాటిల్లో తిరిగేవాడు. హర్షవర్ధన్ కదలికలపై అనుమానం రావడంతో.. అరెస్టు చేసినట్లు ఎస్టీఎఫ్ వర్గాలు వెల్లడించాయి. శాటిలైట్ ఫోన్ను కలిగి ఉన్నందుకు అతనిపై 2011లో కేసు నమోదైందని, వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు చంద్రస్వామి, అంతర్జాతీయ ఆయుధాల వ్యాపారి అద్నాన్ ఖషోగ్గీ వంటి వారితో ఇతనికి సంబంధాలున్నట్లు గుర్తించాయి. కాగా.. 2001లో అమెరికాకు చెందిన ట్రావిస్ మెక్హెన్రీ అనే అధికారి ‘వెస్ట్ ఆర్కిటికా’ దేశాన్ని ప్రకటించి, తాను ఆ దేశానికి గ్రాండ్ డ్యూక్గా పేర్కొన్నారు. 6.2 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న ఆ దేశంలో.. 2,536 మంది పౌరులు జీవిస్తున్నట్లు చెప్పుకొన్నారు. వాస్తవానికి అలాంటి దేశమేలేదు. నిజానికి ఆర్కిటిక్ ఖండం ఉత్తర ధ్రువంలో ఉంటుంది. కానీ, వెస్ట్ ఆర్కిటికా దేశం అంటార్కిటికాలో ఉన్నట్లు పేర్కొనడం హర్షవర్ధన్ జైన్ బండారాన్ని బయటపెట్టి ఉంటుందని స్పష్టమవుతోంది.