Share News

UPI Payments: ఫేస్‌ రికగ్నిషన్‌.. ఫింగర్‌ ప్రింట్‌తోనూ ఇక యూపీఐ చెల్లింపులు

ABN , Publish Date - Oct 08 , 2025 | 03:31 AM

యూపీఐ చెల్లింపుల ప్రక్రియ ఇకపై మరింత సురక్షితం, సులభతరం కానుంది. ఇప్పటిదాకా నాలుగు లేదా ఆరు అంకెల పిన్‌తో జరుపుతున్న యూపీఐ చెల్లింపులను...

UPI Payments: ఫేస్‌ రికగ్నిషన్‌.. ఫింగర్‌ ప్రింట్‌తోనూ ఇక యూపీఐ చెల్లింపులు

ముంబై, అక్టోబరు 7: యూపీఐ చెల్లింపుల ప్రక్రియ ఇకపై మరింత సురక్షితం, సులభతరం కానుంది. ఇప్పటిదాకా నాలుగు లేదా ఆరు అంకెల పిన్‌తో జరుపుతున్న యూపీఐ చెల్లింపులను ఇకపై ముఖ ధ్రువీకరణ (ఫేస్‌ రికగ్నిషన్‌), వేలిముద్రల (ఫింగర్‌ ప్రింట్స్‌)తో కూడా చేసే అవకాశాన్ని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) కల్పిస్తోంది. మంగళవారం ముంబైలో జరిగిన గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి ఎం.నాగరాజు ఈ నూతన విధానాన్ని ప్రారంభించారు. యూపీఐ చెల్లింపులకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పిన్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్న ఈ విధానం సురక్షితమైన, యూజర్‌ ఫ్రెండ్లీ విధానమని ఎన్‌పీసీఐ తెలిపింది. ప్రత్యేకించి యూపీఐ చెల్లింపుల విధానాన్ని వాడుతున్న కొత్త వినియోగదారులకు, వృద్ధులకు బయోమెట్రిక్‌ విధానం మరింత సులభతరమవుతుందని పేర్కొంది. వాస్తవానికి ప్రత్యామ్నాయ విధానం రూపొందించేందుకు మూడేళ్ల క్రితమే ప్ర యత్నాలు మొదలయ్యాయి. అయితే ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా (ఆర్‌బీఐ) ఇచ్చిన ఆదేశాల మేరకు అత్యవసరంగా దీనిని అందుబాటులోకి తెచ్చారు. పిన్‌ ఆధారిత యూపీఐ చెల్లింపులతో దేశంలో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతుండడంతో పిన్‌, ఓటీపీలకు ప్రత్యామ్నాయ విధానాన్ని తీసుకురావాలని ఆర్‌బీఐ అన్ని ఆర్థిక సంస్థలకు సూచించింది.

Updated Date - Oct 08 , 2025 | 03:31 AM