DNA identification: శవజాగారం!
ABN , Publish Date - Jun 14 , 2025 | 04:29 AM
అది అహ్మదాబాద్లోని బీజే మెడికల్ కాలేజీ! విమాన ప్రమాదంలో మాంసపు ముద్దలుగా మారిన మృతదేహాల గుర్తింపునకు డీఎన్ఏ టెస్టు నిర్వహిస్తున్నారక్కడ! అహ్మదాబాద్కే చెందిన కామిని అనే మహిళ విమాన ప్రమాదంలో మృతిచెందింది.
అహ్మదాబాద్ ఆస్పత్రి వద్ద మృతుల బంధువుల పడిగాపులు
ఇప్పటిదాకా 7 మృతదేహాలు మాత్రమే గుర్తింపు.. అందజేత
న్యూఢిల్లీ, జూన్ 13: అది అహ్మదాబాద్లోని బీజే మెడికల్ కాలేజీ! విమాన ప్రమాదంలో మాంసపు ముద్దలుగా మారిన మృతదేహాల గుర్తింపునకు డీఎన్ఏ టెస్టు నిర్వహిస్తున్నారక్కడ! అహ్మదాబాద్కే చెందిన కామిని అనే మహిళ విమాన ప్రమాదంలో మృతిచెందింది. మృతురాలి భర్తను వెంటబెట్టుకొని, ఆమె మరదలు సోనాల్ జోషి, బిగ్గరగా రోదిస్తూ మెడికల్ కాలేజీకి వచ్చింది. ఆకుపచ్చ రంగు పట్టుచీరలో ఉన్న కామిని ఫొటోను పట్టుకొని తిరుగుతోంది. మృతురాలు తన వదిన అని.. ఫొటోలోని రుద్రాక్ష లాకెట్ను చూపిస్తూ ఆ ఆనవాలు మృతదేహం గుర్తింపులో సాయపడగలదేమో చూడండంటూ సిబ్బందిని వేడుకుంటోంది. మనసును కదిలించే ఇలాంటి దృశ్యాలెన్నో కనిపిస్తున్నాయి. తమ ప్రాణప్రాదమైన వారు విమాన ప్రమాదంలో మృతిచెందారనే బాధపడుతున్నవారికి మృతదేహాల అప్పగింతలో తీవ్ర జాప్యం జరుగుతుండటం మరింత బాధ కలిగిస్తోంది. విమాన ప్రమాదంలో 241 మంది చనిపోగా.. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను మాత్రమే గుర్తించి.. కుటుంబసభ్యులకు అప్పగించారు.
మృతదేహాల గుర్తింపునకు డీఎన్ఏ టెస్టు అనివార్యంగా మారింది. ఇందుకు కుటుంబసభ్యులు తమ రక్తనమూనాలను ఇస్తున్నారు. రక్తనమూనాలు ఇచ్చేందుకు క్యూలో 8నెలల బాలుడు కూడా ఉన్నాడు. ఆ శిశువు తండ్రి మహ్మద్ అద్నాన్ విమాన ప్రమాదంలో చనిపోయాడు. జూన్ 6న ఈద్ అల్-ఆధా కోసం అద్నాన్, ఆయన భార్య మంతషా, కుమారుడు ఇబ్రహీం లండన్ నుంచి భారత్కొచ్చారు. తర్వాత.. భార్య, కుమారుడిని ఇక్కడే ఉంచేసి, అద్నాన్ ఒక్కడే లండన్కు బయలుదేరి మృత్యువాతపడ్డాడు. అద్నాన్ కుటుంబం నుంచి ఎవ్వరూ అహ్మదాబాద్లో అందుబాటులో లేకపోవడంతో ఎనిమిది నెలల కుమారుడైన ఇబ్రహీం రక్త నమూనాలను ఇవ్వాల్సి వస్తోంది అని ఆయన బావ నబీల్ చెప్పాడు. కాగా రక్తనమూనాలు ఇచ్చాక రిపోర్టు కోసం కనీసం 72గంటలు పడుతుండటంతో బాధిత కుటుంబసభ్యులకు నిరీక్షణ తప్పడం లేదు. భారీ సంఖ్యలో బాధితులు కారిడార్లలో వేచి ఉన్నారు. మరోవైపు.. మృతదేహాల్లో 135 మృతదేహాల దంత నమూనాలను సేకరించామని అక్కడి ఫోరెన్సిక్ దంతవైద్యుడు జైశంకర్ చెప్పారు.