Police Encounter: ఢిల్లీలో బిహారీ గ్యాంగ్స్టర్ల ఎన్కౌంటర్
ABN , Publish Date - Oct 24 , 2025 | 06:30 AM
ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల ఎదురుకాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ సిగ్మా అండ్ కంపెనీ గ్యాంగ్ సభ్యులైన...
పోలీసుల ఎదురుకాల్పుల్లో నలుగురు హతం
న్యూఢిల్లీ, అక్టోబరు 23: ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల ఎదురుకాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ ‘సిగ్మా అండ్ కంపెనీ’ గ్యాంగ్ సభ్యులైన నలుగురు నేరస్తులు హతమయ్యారు. వీరిపై బిహార్లో హత్యలు, దోపిడీలు, క్రూరమైన నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఎన్కౌంటర్లో మృతి చెందిన వారిని రంజన్ పాథక్ (25), బిమ్లేశ్ మహతో (25), మనీశ్ పాథక్ (33), అమన్ ఠాకూర్ (21)గా పోలీసులు పేర్కొన్నారు. అందరూ బిహార్లోని సీతామర్హి జిల్లాకు చెందిన వారని, సిగ్మా గ్యాంగ్ సభ్యులని వెల్లడించారు. ఢిల్లీ, బిహార్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో భాగంగా జరిగిన ఎదురుకాల్పుల్లో వీరు హతమయ్యారని చెప్పారు. ఈ నేరగాళ్లు కొద్ది రోజులుగా ఢిల్లీలో దాగి ఉన్నారన్న సమాచారం మేరకు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో తారసపడిన వారు పోలీసులపై కాల్పులు జరిపారని, ప్రతిగా జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు నేరస్తులు గాయపడ్డారని, ఆ తర్వాత ఆస్పత్రికి తరలించగా.. మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.