CRPF: కర్రెగుట్టల్లో కమాండో ట్రైనింగ్ స్కూల్
ABN , Publish Date - Oct 13 , 2025 | 06:40 AM
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో కమాండో ట్రైనింగ్ స్కూల్ను ఏర్పాటు చేసే దిశగా కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ప్రణాళికలు రచిస్తోంది.
సీఆర్పీఎఫ్ యోచన సరైన ప్రదేశం కోసం కొనసాగుతున్న సర్వే
న్యూఢిల్లీ/బీజాపూర్, అక్టోబరు 12: తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో కమాండో ట్రైనింగ్ స్కూల్ను ఏర్పాటు చేసే దిశగా కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ప్రణాళికలు రచిస్తోంది. నక్సల్స్కు వ్యతిరేకంగా కర్రెగుట్టలు కేంద్రంగా జరిగిన ఆపరేషన్లో గత ఏప్రిల్, మే నెలల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్లో భాగంగా కొన్నేళ్లు మావోయిస్టులు స్థావరంగా మార్చుకున్న కర్రె గుట్టలను బలగాలు జల్లెడపట్టారు. సీఆర్పీఎఫ్, కోబ్రా యూనిట్, ఛత్తీస్గఢ్ పోలీసులు కర్రెగుట్టల్లో చేపట్టిన ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’లో భాగంగా భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు మావోయిస్టులపై జరిగిన అతిపెద్ద ఆపరేషన్ ఇదే. 2026 మార్చి నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదానికి ముగింపు పలకాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే ఈ ఆపరేషన్ను చేపట్టారు. దాదాపు 60 కిలో మీటర్ల పొడవు, 5-20 కిలో మీటర్ల వెడల్పుతో విస్తరించిన ఈ ప్రాంతంలో గుహలు, బంకర్లు వెలుగుచూశాయి. ఈ గుట్టలపై వివిధ రకాల జంతువులు, కీటకాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కమాండో ట్రైనింగ్ స్కూల్కు అనుకూలమైన ప్రదేశాన్ని గుర్తించేందుకు సర్వే జరుగుతోందని అధికారిక వర్గాలు పీటీఐకి తెలిపాయి. ఒక ప్రాంతంపై విజయం ప్రకటించిన తర్వాత భద్రతా బలగాల ద్వారా ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకోవాల్సి ఉంటుందని, లేదంటే ఆయా వర్గాలు మళ్లీ సంఘటితమయ్యే అవకాశం ఉంటుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. కమాండోలకు శిక్షణ ఇచ్చేందుకు కర్రెగుట్టల్లో శాశ్వత కేంద్రాన్ని స్థాపించడానికి గాను పారామిలటరీ దళం, ఛత్తీస్గఢ్ పోలీస్ నుంచి ఓ అధికారుల బృందం లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల అంశాలను పరిశీలిస్తోందని మరో అధికారి తెలిపారు.