Poster War: కాంగ్రెస్ బీజేపీ పోస్టర్ వార్
ABN , Publish Date - Apr 30 , 2025 | 05:44 AM
పహల్గామ్ ఉగ్రదాడిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ‘తలలేని ప్రధాని’ పోస్టర్ను ‘ఎక్స్’ లో పెట్టడంతో రాజకీయం వేడెక్కి, తదుపరి వివాదాల నేపథ్యంలో ఆ పోస్టర్ను తొలగించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): పహల్గాం ఉగ్ర దాడిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు పతాకస్థాయికి చేరాయి. మంగళవారం పోస్టర్ యుద్ధానికి దిగాయి. పసుపు రంగు కుర్తా పైజామా, నల్లటి బూట్లు ధరించిన ప్రధాని చిత్రాన్ని తల లేకుండా కాంగ్రెస్ సోమవారం రాత్రి ‘ఎక్స్’లో పోస్టుచేసింది. దాని కింద ‘బాధ్యత వహించాల్సిన సమయంలో మాయమయ్యారు’ అనే సందేశం పెట్టింది. దీనిని పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి రీట్వీట్ చేయడంతో బీజేపీ మంగళవారం.. కాంగ్రె్సపై విరుచుకుపడింది. రాహుల్గాంధీ పాకిస్థాన్ మిత్రుడంటూ బీజేపీ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ ట్వీట్ చేయడమేగాక.. వీపు వెనుక కత్తి దాచుకుని ఉన్న రాహుల్ చిత్రాన్ని పోస్టు చేశారు. పహల్గాం ఉగ్ర ఘటన తర్వాత కేంద్రం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో ప్రధాని పాల్గొనకపోవడంపై కాంగ్రెస్ తరచూ విమర్శలు చేస్తోంది. ఆ క్రమంలోనే తాజా పోస్టర్ను పోస్టు చేసింది. దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో స్పందించింది. కాంగ్రెస్ సంపూర్ణంగా పాకిస్థాన్కు మద్దతిస్తోందని.. ఆ పార్టీని ‘లష్కరే పాకిస్థాన్ కాంగ్రె్స’గా అభివర్ణించింది.
అఖిల పక్ష సమావేశంలో ఐక్యత గురించి ఆ పార్టీ నొక్కిచెప్పిందని.. కానీ ఆ పార్టీ నేతలు పాక్తో చర్చలు జరపాలంటున్నారని ఆక్షేపించింది. ‘తలలేని మొండెం’.. ఆ పార్టీ ఉగ్ర సిద్ధాంతంగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు. ‘తలలేని ప్రధాని చిత్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పోస్టు చేసింది. తద్వారా భారత్లో మీర్ జాఫర్ మద్దతుదారులున్నారని పాకిస్థాన్కు గట్టి సందేశం పంపింది. రాహుల్గాంధీ ఆదేశాలతోనే ఆ పోస్టు పెట్టారు. దీనిని చూసి దేశం సిగ్గుపడుతోంది. క్లిష్ట సమయంలో భారత్ను బలహీనపరిచేందుకు లష్కరే పాకిస్థాన్ కాంగ్రెస్ చేసిన ప్రయత్నమిది’ అని విమర్శించారు. తలలేని మొండెం ఉగ్రవాద నినాదమని.. ఆ పార్టీ పోస్టర్ దానినే ప్రతిబింబిస్తోందన్నారు. ముస్లిం ఓటు బ్యాంకును సంతృప్తిపరచడానికే కాంగ్రెస్ తలలేని మొండెం చిత్రాన్ని పోస్టుచేసిందని బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జి అమిత్ మాలవీయ ‘ఎక్స్’లో ఆరోపించారు. ఈ వివాదంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పందించారు. ‘‘పార్లమెంటు చర్చల్లో ప్రధాని పాల్గొని పహల్గాం ఘటన తదనంతర పరిణామాలపై వివరణ ఇవ్వాలని కోరాం. ఇందులో రాజకీయ ఎజెండా ఏమీ లేదు. ఐక్యతే కాంగ్రెస్ ఫార్ములా’ అని స్పష్టం చేశారు.
పోస్టరు తొలగింపు..
తీవ్ర రాజకీయ దుమారం దరిమిలా ‘తలలేని ప్రధాని’ పోస్టర్ను ‘ఎక్స్’నుంచి కాంగ్రెస్ పార్టీ తొలగించింది. ఈ పోస్టర్పై కాంగ్రెస్ నాయకుల్లోనే విభేదాలు తలెత్తినట్లు సమాచారం. పార్టీ వైఖరికి భిన్నమైన పోస్టరుకు అనుమతించినందుకు పార్టీ సోషల్ మీడియా విభాగం సారథి సుప్రియ శ్రీనతేను కాంగ్రెస్ అధిష్ఠానం మందలించిందని, తక్షణం పోస్టరు తొలగించాలని ఆదేశించిందని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి..