Share News

Ladakh protests: భగ్గుమన్న లద్దాఖ్‌

ABN , Publish Date - Sep 25 , 2025 | 04:08 AM

లద్దాఖ్‌లో ఆందోళనకారులు రెచ్చిపోయారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడంతో పాటు ఆరో షెడ్యూల్‌లో చేర్చాలన్న డిమాండ్లతో ప్రారంభించిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. బుధవారం లేహ్‌ నగరంలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు..

Ladakh protests: భగ్గుమన్న లద్దాఖ్‌

  • నలుగురి మృతి

  • 70 మందికి పైగా గాయాలు

  • లేహ్‌లో బీజేపీ ఆఫీసు దగ్ధం

  • సెక్రటేరియట్‌ భవనానికి నిప్పు

  • పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు

  • వాంగ్‌చుక్‌ నిరసన విరమణ

  • ఆయన రెచ్చగొట్టడం వల్లే హింస.. కేంద్రం ఆరోపణ

లేహ్‌, సెప్టెంబరు 24: లద్దాఖ్‌లో ఆందోళనకారులు రెచ్చిపోయారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడంతో పాటు ఆరో షెడ్యూల్‌లో చేర్చాలన్న డిమాండ్లతో ప్రారంభించిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. బుధవారం లేహ్‌ నగరంలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. స్థానిక బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. పోలీసులతోనూ ఘర్షణకు దిగారు. వారిపై రాళ్లు రువ్వారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్ప వాయువును ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు. ఈ హింసాత్మక ఘటనల్లో నలుగురు మరణించగా, 22 మంది పోలీసులు సహా 70 మందికిపైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. నిరసనలు హింసగా మారడంతో కేంద్ర ప్రభుత్వం లేహ్‌లో ఆంక్షలు విధించింది. నిరసనలు, ఎక్కువ మంది గుమిగూడడంపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370ని ఎన్డీయే ప్రభుత్వం 2019, ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ తర్వాత జమ్మూకశ్మీరు, లద్దాఖ్‌లకు రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్లు వచ్చాయి. లద్దాఖ్‌ను రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌ పరిధిలో చేర్చాలని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ఈ డిమాండ్లతో పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ నేతృత్వంలో 15 మంది నిరాహార దీక్ష ప్రారంభించారు. వారిలో ఇద్దరి ఆరోగ్యం క్షీణించడంతో బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వాంగ్‌చుక్‌ మంగళవారం తన నిరశనను విరమించారు. హింసకు పాల్పడవద్దని ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ‘లేహ్‌ అపెక్స్‌ బాడీ (ఎల్‌ఏబీ)’కి చెందిన యువజన విభాగం ఆందోళనలకు పిలుపునిచ్చింది. బుధవారం కొందరు నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు విసరడంతో హింస మొదలైంది. నిరసనకారులు బీజేపీ కార్యాలయానికి, సెక్రటేరియట్‌ భవనానికి నిప్పు పెట్టారు. ప్రజల డిమాండ్లపై చర్చించేందుకు అక్టోబరు 6న సమావేశానికి రావాలంటూ కేంద్రం లద్దాఖ్‌ ప్రతినిధులను ఆహ్వానించిన సమయంలో ఈ హింస చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, లద్దాఖ్‌లో హింసకు కారణం పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ అని కేంద్ర హోం శాఖ ఆరోపించింది. ‘‘అరబ్‌ ప్రజాస్వామ్య ఉద్యమాలు, నేపాల్‌లో జెన్‌-జీ ఉద్యమాలను ప్రస్తావిస్తూ వాంగ్‌చుక్‌ రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు. ఆ ప్రకటనలతో రెచ్చిపోయిన అల్లరిమూకలు హింసకు పాల్పడ్డారు’’ అని పేర్కొంది.


రాజ్యాంగ భద్రతల కోసం..!

కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాలనను లద్దాఖ్‌ ప్రజలు మూడేళ్లుగా నిరసిస్తున్నారు. తమ భూమి, సంస్కృతి, వనరుల పరిరక్షణ కోసం రాజ్యాంగ భద్రత ఉండాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర హోదాతో పాటు లద్దాఖ్‌ను ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతున్నారు. అలాగే లేహ్‌, కార్గిల్‌కు వేర్వేరు లోక్‌సభ స్థానాలు ఉండాలని, లద్దాఖ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్‌ చేస్తున్నారు. వాంగ్‌చుక్‌ పదేపదే నిరాహార దీక్షలకు దిగడంతో లద్దాఖ్‌ ప్రజల ఉద్యమం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆయన ఈ నెల 10 నుంచి 35 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. కానీ, ఆందోళనలు హింసాత్మకం కావడంతో మంగళవారం దీక్షను విరమించారు.

Updated Date - Sep 25 , 2025 | 04:08 AM