Suraksha Portal: ఆయుష్ సురక్షా పోర్టల్ ప్రారంభం
ABN , Publish Date - May 31 , 2025 | 06:14 AM
కేంద్ర ప్రభుత్వం సంప్రదాయ వైద్యంపై తప్పుదోవ ప్రకటనలను అడ్డుకోవడానికి ఆయుష్ సురక్షా పోర్టల్ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా మందుల దుష్ప్రభావాలు, ఫిర్యాదులను ప్రజలు, వైద్యులు తెలుసుకుని చర్యలు తీసుకోగలుగుతారు.
మందులపై తప్పుడు ప్రకటనల నివారణే లక్ష్యం
న్యూఢిల్లీ, మే 30: సంప్రదాయ వైద్యంపై తప్పుదోవ పట్టించే ప్రకటనలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆయుష్ సురక్షా పోర్టల్ను కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతా్పరావు జాదవ్ శుక్రవారం ఇక్కడ ప్రారంభించారు. గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రం ఈ పోర్టల్ను రూపొందించింది. తప్పుదోవపట్టించే ప్రకటనలు, మందుల దుష్ప్రభావాలపై ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. సామాన్య ప్రజలతో పాటు, వైద్యులకు కూడా ఇది ఉపకరిస్తుందని మంత్రి చెప్పారు. దీని ద్వారా ఫిర్యాదులు చేసే అవకాశం కూడా ఉందని ఆయుష్ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా తెలిపారు.