Delhi security: రాజధాని ఢిల్లీపై సుదర్శన చక్రం
ABN , Publish Date - Dec 31 , 2025 | 04:26 AM
దేశ రాజధాని ఢిల్లీకి వైమానిక దాడుల నుంచి రక్షణ కల్పిస్తూ.. ఈ ప్రాంతాన్ని శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
రూ.5,181 కోట్ల విలువైన గగనతల రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం
ఇక శత్రు దుర్భేద్యంగా మారనున్న ఢిల్లీ
30 కిలోమీటర్ల పరిధిలో వైమానిక దాడులకు అడ్డుకట్ట
న్యూఢిల్లీ, డిసెంబరు 30: దేశ రాజధాని ఢిల్లీకి వైమానిక దాడుల నుంచి రక్షణ కల్పిస్తూ.. ఈ ప్రాంతాన్ని శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన వీఐపీ-89 జోన్లో గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ‘సుదర్శన్ చక్ర’ పేరిట స్వదేశీ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (ఐఏడీడబ్ల్యూఎస్) ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపినట్టు సమాచారం. ప్రధాని ఇటీవల ప్రకటించిన ‘సుదర్శన్ చక్ర’ ఫ్రేమ్వర్క్లో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద ఢిల్లీలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు జాతీయ మీడియాలో ఓ కథనం వెలువడింది. డీఆర్డీవో అభివృద్ధి చేస్తున్న ఈ గగనతల రక్షణ వ్యవస్థ విలువ రూ.5,181 కోట్లు ఉంటుందని, ఢిల్లీ చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి గగనతల ముప్పునైనా అడ్డుకునేలా బహుళ అంచెల భద్రతను ఇది అందిస్తుందని ఆ కథనం వెల్లడించింది. డ్రోన్లు, క్షిపణి దాడులను ఐఏడీడబ్ల్యూఎస్ సమర్థమంతంగా తిప్పికొట్టగలదని కథనం పేర్కొంది.