Share News

Corporation Elections: కేరళలో కమల వికాసం

ABN , Publish Date - Dec 14 , 2025 | 04:43 AM

కేరళలో కమలం వికసించింది!. దాదాపు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాల్లో తొలిసారి బీజేపీ ఇక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది.

Corporation Elections: కేరళలో కమల వికాసం

  • తిరువనంతపురం కార్పొరేషన్‌ ఎన్నికల్లో తొలిసారి బీజేపీ విజయం

  • 101 వార్డుల్లో 50 స్థానాలు కైవసం

  • ఇది సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, డిసెంబరు 13: కేరళలో కమలం వికసించింది!. దాదాపు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాల్లో తొలిసారి బీజేపీ ఇక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. తాజాగా జరిగిన తిరువనంతపురం కార్పొరేషన్‌ ఎన్నికల్లో 101 వార్డులకుగాను 50 స్థానాలు దక్కించుకుని కార్పొరేషన్‌పై కాషాయ పతాకాన్ని ఎగురవేసింది. వాస్తవానికి కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం పార్లమెంటు స్థానంలోనే కార్పొరేషన్‌ పరిధి ఉంది. అలాంటి చోట బీజేపీ భారీ విజయం నమోదు చేయడం విశేషం. అధికార కూటమి లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(ఎల్‌డీఎ్‌ఫ)కు ఈ ఎన్నికల్లో ప్రజలు భారీ ఓటమిని కట్టబెట్టారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ విజయం ఆ పార్టీలో మరింత జోష్‌ పెంచింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఊహించని విధంగా 50 వా ర్డుల్లో విజయం దక్కించుకోవడం పట్ల కూటమి నేత లు హర్షం వ్యక్తం చేశారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఒక సీటును, దాదాపు ఐదేళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక స్థానాన్ని మాత్రమే బీజేపీ కైవసం చేసుకుంది. అలాంటి పరిస్థితి నుంచి తిరువనంతపురం కార్పొరేషన్‌లో పాగా వేసే వరకు చేరుకోవడం గమనార్హం. కాగా, తాజా ఎన్నికల్లో.. ఎన్డీయే 50 స్థానాల్లో గెలవగా ఎల్‌డీఎఫ్‌ 29, యూడీఎఫ్‌ 19 వార్డులకే పరిమితమయ్యాయి. మరో రెండు చోట్ల స్వతంత్రులు విజ యం దక్కించుకున్నారు. మరోవైపు, ఎర్నాకుళం కార్పొరేషన్‌ను కూడా ఎన్డీయే కైవసం చేసుకుంది.


మార్పునకు సంకేతం: శశిథరూర్‌

కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ స్పందిస్తూ.. కేరళ రాజకీయాల్లో ఇది గణనీయమైన మార్పునకు సంకేతమని అభివర్ణించారు. కాంగ్రెస్‌, యూడీఎ్‌ఫల తరఫున విజయం దక్కించుకున్న కార్పొరేటర్లకు శుభాకాంక్షలు చెబుతూనే బీజేపీ సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ప్రజల ఆకాంక్షలకు ఈ ఎన్నికలు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కాగా, వక్ఫ్‌ భూముల వివాదంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఎర్నాకుళం జిల్లాలోని ‘మునంబం’ వార్డును కూడా బీజేపీ దక్కించుకుంది. 2019 నుంచి ఈ ప్రాంతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక్కడి 404 ఎకరాల భూమిని కేరళ వక్ఫ్‌బోర్డు తమ ఆస్తిగా ప్రకటించుకుంది. దీంతో ఇక్కడ నివసిస్తున్న 500 మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

స్థానికంలో ‘యూడీఎఫ్‌’ స్వీప్‌

కొచ్చి: కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమి మెజారిటీ బ్లాక్‌ పంచాయతీలను దక్కించుకుంది. అధికార ఎల్‌డీఎఫ్‌ కూటమి రెండో స్థానంలో నిలవగా ఎన్డీయే కూడా సత్తా చాటుతోంది. శనివారం రాత్రి కడపటి వార్తలు అందేసరికి యూడీఎఫ్‌ 82, ఎల్‌డీఎఫ్‌ 65 బ్లాక్‌ పంచాయతీలను సొంతం చేసుకున్నాయి.

Updated Date - Dec 14 , 2025 | 04:44 AM